Sakshi News home page

తెలంగాణలో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నిధులివ్వండి

Published Sat, Sep 20 2014 1:51 AM

give me funds for developing power projects

పధ్నాలుగో ఆర్థిక సంఘానికి ఫ్యాప్సీ విజ్ఞప్తి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మరిన్ని నిధులు కేటాయించాలని పధ్నాలుగో ఆర్థిక సంఘానికి  పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం 3,000 మెగావాట్ల మేర ఉంటోండగా.. రాబోయే ఐదేళ్లలో ఇది 14,000 మెగావాట్ల పైచిలుకు పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
 
భారీ స్థాయిలో వ్యవసాయ పంపుసెట్లు, పరిశ్రమలతో పాటు రాజధాని హైదరాబాద్ నగర విద్యుత్ అవసరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్ కుమార్ రుంగ్టా తెలిపారు. మరోవైపు, వెనుకబడిన జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కూడా మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని వివరించారు. అటు, కేంద్ర పన్నుల ఆదాయాల్లో రాష్ట్రాల వాటాను సైతం 45-50%కి పెంచాలన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం అమలుకు   గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక సంఘాన్ని ఫ్యాప్సీ కోరింది.

Advertisement
Advertisement