సాక్షి, న్యూఢిల్లీ: పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుందా? తాజా నివేదికల ప్రకారం ఆదాయ పన్ను మినహాయంపులో పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించనుంది. రూ.5లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చే అంశాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. 2018 కేంద్రబడ్జెట్లో ఈ అంశాన్ని చేర్చేందుకు కసరత్తు చేస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయనకు ఒక లేఖ రాసింది. పెన్షనర్లకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే ప్రతిపాదనను వచ్చే 2018 బడ్జెట్ నాటికి పరిశీలిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. 2018ఆర్ధిక బిల్లులో దీని ఫలితాన్ని ప్రతిబింబించే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
రూ.5 లక్షల వార్షిక ఆదాయం వచ్చే పెన్షనర్లను ఆదాయ పన్నునుంచి మినహాయించాలనే తన అభ్యర్ధనకు ప్రభుత్వంనుంచి కొంత-ప్రోత్సాహక ప్రత్యుత్తరం వచ్చిందంటూ థరూర్ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నెక్ట్స్ బడ్జెట్లో ఈ అంశాన్ని చేరుస్తారనే ఆశాభావాన్ని వయక్తం చేశారు. ప్రస్తుతం 60 నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న సీనియర్ పౌరుడు అయిన పింఛనుదారుడుకి లభిస్తున్న ఆదాయం పన్ను మినహాయింపు రూ 3లక్షలు.
పెన్షన్తో సహా మొత్తం ఆదాయం రూ.5 లక్షలు మించకపోతే, 80 ఏళ్లకు పైబడిన పింఛనుదారుడు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయాలని శశి థరూర్ నవంబర్ 14 న కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని ప్రస్తుత నిబంధనలకు సవరణ చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు.
కాగా 2018 కేంద్ర బడ్జెట్ కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటుకు సమర్పించనున్నారు.