పెట్రోలు పంపులు ఫుల్‌.. నిల్వ ఎలా? | Sakshi
Sakshi News home page

పెట్రోలు పంపులు నిండిపోయాయి: నిల్వ ఎలా?

Published Wed, Apr 22 2020 4:40 PM

India running out of space to store oil Petrol pumps almost full - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు కరోనా వైరస్ సంక్షోభంతో రికార్డు స్థాయికి పతనమయ్యాయి. కోవిడ్-19  లాక్‌డౌన్  కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పెట్రోలు డిమాండ్ పాతాళానికి పడిపోయింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దాచడానికి వీల్లేనంతగా పెట్రోలు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోని పెట్రోలు బంకులు దాదాపు నిండిపోయాయనీ, పెట్రోలు నిల్వ చేసుకునే సామర్థ్యం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా 66,000 పంప్ స్టేషన్లతో సహా, ప్రతి కంటైనర్లో ఇంధనం నిల్వ చేసుకునేందుకు స్థలం లేకుండా పోయింది. దేశంలోని రిఫైనర్లు 85 మిలియన్ బారెల్స్ ఇంధన నిల్వ సామర్థ్యంలో 95 శాతం నిండిపోయాయని  రిఫైనరీ అధికారులు తెలిపారు.  

ప్రభుత్వ యాజమాన్యంలోని దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 10శుద్ధి కర్మాగారాలలో కార్యకలాపాలను దాదాపు సగానికి తగ్గించగా, మిగిలినవి 35 శాతం పనిచేస్తున్నాయని ఎఫ్‌జీఈ కన్సల్టెంట్ సెంథిల్ కుమారన్ తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాసెసర్‌లను పక్కన పెడితే, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనర్ రిలయన్స్ ఇండస్ట్రీస్  భారతదేశం వెలుపల లీజుకు తీసుకున్న కార్గోల్లో నిల్వ చేస్తూ వుండొవచ్చని పేర్కొన్నారు. భారతదేశం మొత్తం చమురు ఉత్పత్తి డిమాండ్ ఈ త్రైమాసికంలో రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చొప్పున పడిపోతుందని అంచనా వేశారు.

డిమాండ్  తిరిగి పుంజుకునే అవకాశం సమీపంలో కనిపించడం లేదని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీల డైరెక్టర్ ఆర్ రామచంద్రన్ అన్నారు. పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులతో ముంబై, ఢిల్లీ, కలకత్తా వంటి ప్రధాన వినియోగ కేంద్రాలు ఇప్పుటికే ఇబ్బందుల్లో  ఉన్నాయన్నారు. అటు విస్తరిస్తున్న కరోనా  కారణంగా చమురు ధరలను చరిత్రలో మొదటిసారి కనీవిని ఎరుగని కనిష్టానికి చేరాయని, ముడి, శుద్ధి చేసిన ఇంధనాలను నిల్వ చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని స్థలాలను లీజుకు తీసుకున్నట్లు అతిపెద్ద స్వతంత్ర చమురు నిల్వ సంస్థ, రాయల్ వోపాక్ ఎన్వి తెలిపింది. అయితే ఈ వార్తలపై బీపీసీఎల్‌తో పాటు, హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ , ఇండియన్ ఆయిల్ కార్ప్ ఇంకా స్పందించలేదు.  (టెకీలకు క్యాప్ జెమిని శుభవార్త)

కాగా రిటైల్ స్టేషన్లతో పాటు, భారతీయ రిఫైనర్లు 300 కి పైగా డిపోలు, టెర్మినల్స్, అలాగే 250 ఏవియేషన్ ఇంధన స్టేషన్లలో పెట్రోలియం ఇంధనాలను నిల్వ చేస్తాయి. మొత్తం సామర్థ్యంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ డీజిల్ నిల్వ చేయడానికి, మరో 20 శాతం గ్యాసోలిన్ నిల్వ కోసం ఉపయోగిస్తారు. లాక్‌డౌన్‌తో  విమానాల రాకపోకలు, సహా అన్ని రవాణా సేవలు రద్దు చేయడంతో భారతదేశంలోని వివిధ పెట్రోల్ బంకులలో 50 శాతం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. భారతదేశ చమురు డిమాండ్‌లో సగానికి పైగా, డీజిల్, గ్యాసోలిన్ వినియోగం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో 60శాతం కంటే ఎక్కువ పడిపోయింది. మరోవైపు కరోనా కట్టడికి మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన  సంగతి తెలిసిందే.  (అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్)

Advertisement
Advertisement