బంగారం డిమాండ్‌లో భారత్‌దే పైచేయి | Sakshi
Sakshi News home page

బంగారం డిమాండ్‌లో భారత్‌దే పైచేయి

Published Fri, May 15 2015 1:31 AM

బంగారం డిమాండ్‌లో భారత్‌దే పైచేయి

2015లో చైనాను అధిగమించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా
- జనవరి-మార్చి డిమాండ్ 15 శాతం వృద్ధి   
- అంతర్జాతీయంగా 7 శాతం క్షీణత

ముంబై: మంచి వృద్ధి అంచనాల నేపథ్యంలో భారత్ బంగారం డిమాండ్ 2015లో చైనాకన్నా అధికంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) పేర్కొంటోంది. రెండు దేశాల బంగారం డిమాండ్ 2015లో 900 నుంచి 1,000 టన్నుల శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (క్యూ1-జనవరి నుంచి మార్చి) భారత్ బంగారం డిమాండ్‌లో 15 వృద్ధి నమోదయ్యిందని వివరించింది.

2014 ఇదే కాలంతో పోల్చితే డిమాండ్ పరిమాణం 167.1 టన్నుల నుంచి 191.7 టన్నులకు పెరిగిందని వివరించింది. ఇక అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ క్యూ1లో 7 శాతం క్షీణించిందనీ, విలువ  45 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గిందని వివరించింది. చైనా, టర్కీ, రష్యా వంటి దేశాల్లో డిమాండ్ భారీగా లేకపోవడం దీనికి కారణం. డబ్ల్యూజీసీ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా)  సోమసుందరం ఈ అంశాలను తెలిపారు.
 ముఖ్యాంశాలు...
     
- విలువ రూపంలో భారత్ బంగారం డిమాండ్ క్యూ1లో 9 శాతం ఎగసి రూ.42.899 కోట్ల నుంచి రూ.46,731 కోట్లకు పెరిగింది.
- 2015 మొదటి క్వార్టర్‌లో భారత్‌కన్నా చైనాలో బంగారం డిమాండ్ అధికంగానే ఉంది. ఇది 272.9 టన్నులుగా ఉంది. అయితే ప్రస్తుత, రాను న్న త్రైమాసికాల్లో భారత్ డిమాండ్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. 2014 మొదటి క్వార్టర్‌లో చైనా బంగారం డిమాండ్ 293.8 టన్నులు. దీనితో పోల్చితే 2015 క్యూ1లో 7% క్షీణత.
- క్యూ1లో భారత్ ఆభరణాల డిమాండ్ 22 శాతం వృద్ధితో 151 టన్నులకు చేరింది. అయితే ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ 6 శాతం క్షీణించి 41 టన్నులుగా ఉంది. విలువ రూపంలో చూస్తే, ఆభరణాలకు డిమాండ్ 16 శాతం వృద్ధితో రూ.36,761 కోట్లకు చేరింది. పెట్టుబడుల విలువ 11% తగ్గి రూ. 9,969 కోట్లకు చేరింది.

Advertisement
Advertisement