తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా | Sakshi
Sakshi News home page

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా

Published Wed, Jul 23 2014 1:35 AM

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా - Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాజెక్టుల అనుమతుల విషయంలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా తెలంగాణ సర్కార్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరలో పరిచయం చేయనుంది. కంపెనీ, పెట్టుబడి, ఉపాధి వంటి వివరాలతో ప్రాజెక్టు ప్రతిపాదనను వెబ్‌సైట్ ద్వారా పంపిస్తే చాలు. సీఎం కార్యాలయంలోని ఛేజింగ్ సెల్ ఈ దరఖాస్తును పరిశీలించి కంపెనీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానిస్తుంది. విశ్వసనీయ ప్రతిపాదన అయితే రెండు వారాల్లో అన్ని అనుమతులను ప్రభుత్వమే దగ్గరుండి చూసుకుంటుంది.

 ఈ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి కంపెనీ ప్రతినిధులను పిలిచి అనుమతి పత్రాలను అందజేస్తుంది. ఈ వ్యవహారాన్నంతా తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై చేస్తున్న కసరత్తులో భాగంగా మంగళవారమిక్కడ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. రూ.1 కోటి చెక్కు, నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. సానియా ప్రపంచ నంబర్ 1 ర్యాంకుకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.

 చిన్న పరిశ్రమలకు..
 సీఎం సమావేశంలో 45 పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు హాజరై పలు సూచనలు చేశారు. వ్యాట్ ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్ కేటగిరీ కిందకు వచ్చే కంపెనీలు అనుమతుల కోసం ఇక నుంచి పీసీబీకి దరఖాస్తు చేసే అవసరం లేదని ప్రకటించారు. పరిశ్రమలకు రావాల్సిన రూ.700 కోట్ల సబ్సిడీలో కొంతైనా విడుదలకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాటన్‌తోపాటు మరో పరిశ్రమ నుంచి పీక్ అవర్ పెనాల్టీ సుమారు రూ.50 కోట్లను ప్రస్తుతానికి వసూలు చేయొద్దని అధికారులకు ఆదేశించారు.

కాగా, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే..
 ప్రతి అంగుళం స్థలం..: తెలంగాణలో 35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 20 లక్షల ఎకరాలు సాగుకు పనికిరాదు. దీన్ని పరిశ్రమలకు మల్చవచ్చు. వెంటనే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన 3 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో అధికభాగం హైదరాబాద్‌కు 110 కిలోమీటర్ల పరిధిలో ఉంది. భారీగా స్థలం తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలు చాలానే ఉన్నాయి. ఇక నుంచి ఒక్క అంగుళం కూడా వృథాగా పోకూడదు. కంపెనీ కోసం నిపుణులను ఎక్కడి నుంచి తెచ్చుకున్నా స్థానికులక ఉపాధి కల్పించండి.

 ప్లగ్ అండ్ ప్లే ..: తయారీ రంగంలో చైనా అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. అక్కడి మాదిరిగా తెలంగాణలోనూ ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను కల్పిస్తాం. పారిశ్రామికవేత్త 25-36 అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే కాలుష్య నియంత్రణ మండలి మినహా అన్ని అనుమతులను ఒకేచోట ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం.  సింగపూర్‌ను మించిన అసలైన సింగిల్ విండో విధానం రానుంది. పరిశ్రమలకు 10% నీటిని కేటాయిస్తాం. ఇప్పటికే ఉన్న కంపెనీలను దృఢపరుస్తాం.

 మరో హైదరాబాద్..: రియల్ ఎస్టేట్ హైదరాబాద్‌లో పెద్ద పరిశ్రమ. పరిశ్రమలను ప్రోత్సహిస్తే ఇప్పుడున్న హైదరాబాద్‌కు మరో హైదరాబాద్ తోడవుతుంది. జనాభా 2 కోట్లను మించిపోతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో మాట్లాడతాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్‌కు ఉపక్రమించాం. నాగరికత, ప్రశాంత వాతావరణం కోసం హైదరాబాద్ నగరాన్ని క్రమబద్దీకరించాల్సిందే.


 తెలంగాణ బాగుపడాలి..: తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నది నా ఆశ. బీసీ, ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే వీరికి తోడ్పాటు అందించనుంది. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(డిక్కీ) నుంచి 100 మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. వీరికి రూ.100 కోట్లవరకూ సహాయం చేసేందుకు రెడీ.

 ఫీజు రీఇంబర్స్‌మెంట్ పెద్ద మోసం..
 ఫీజు రీఇంబర్స్‌మెంట్ పెద్ద మోసం. పిల్లలు లేకున్నా బ్రోకర్లను ప్రోత్సహించి రీఇంబర్స్‌మెంట్ మొత్తాలను కొన్ని కళాశాలలు ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావాలంటే మన పిల్లల్లో నైపుణ్యం ఉండాలి. వసతులు లేని కళాశాలల్లో చదవడం వల్లే పిల్లల్లో నైపుణ్యం లోపించిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 కేసీఆర్‌కు పారిశ్రామిక సంఘాల సూచనలు ఇవీ..
 కేసీఆర్ సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు పలు సూచనలు చేశారు. స్టార్టప్‌లకు ప్రోత్సహించాలని నాస్కామ్ వైస్ చైర్మన్, సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి కోరారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో అపార అవకాశాలున్నాయని, క్లస్టర్లకు పూర్తి సహకారం అందించాలన్నారు. కొత్త కంపెనీలే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. తెలంగాణకు మీరే బ్రాండ్ అంబాసిడర్ అంటూ కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు.

వ్యాపారానికి అనువైన, నిపుణులకు నెలవైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సురేష్ చిట్టూరి కోరారు. మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున వ్యయం చేయాలన్నారు. ఫిక్కీ ఆంధ్రప్రదేశ్ చైర్ పర్సన్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రంగాలను వృద్ధి బాట పట్టించేందుకు ప్రభుత్వం నుంచి సీడ్ ఫండ్ సమకూర్చాలని విన్నవించారు. పన్ను విధానాల్లో సంస్కరణలు తేవాలని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా సూచించారు. రాయితీలు కాదని, తాము కోరేది పెద్ద కంపెనీలతో అనుసంధానమని  డిక్కీ ప్రతినిధి నర్రా రవి కుమార్ పేర్కొన్నారు.

 ఫార్మా కంపెనీలకు పీసీబీ పెద్ద సమస్యగా పరిణమించిందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎంఈ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి మాట్లాడుతూ కంపెనీల రుణాలను పునర్‌వ్యవస్థీకరించాలని కోరారు. సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ కార్యదర్శి గోపాల్ రావు పేర్కొన్నారు. మహిళలకు తగు ప్రోత్సాహం ఇచ్చేలా పారిశ్రామిక విధానం ఉండాలని కోవె ప్రెసిడెంట్ సౌదామిని సీఎంను కోరారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సూక్ష్మ, చిన్న కంపెనీల సమస్యలపై చర్చించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు సీఎంకు విన్నవించారు.

Advertisement
Advertisement