న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను 'మేక్ ఇన్ ఇండియా' డివైజ్లే పెంచాయట. భారత బ్రాండ్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 45 శాతం నమోదయ్యాయట. 2015 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఇవి 7శాతం పెరిగాయని తాజాగా వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో మేడ్ ఇన్ ఇండియా హ్యాండ్ సెట్లు 67 శాతం దోహదం చేశాయని ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్-2016 మొదటి త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. మేడ్ ఇన్ ఇండియా డివైజ్ లకు డిమాండ్ పెరగడంతో, మొదటి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల సరుకు రవాణా 554 లక్షల నుంచి 528 లక్షలకు తగ్గినట్లు తెలిపింది. గతేడాది ఈ క్వార్టర్ తో పోలిస్తే 4శాతం సరుకు రవాణా తగ్గిందని పేర్కొంది.
రూ.10వేల నుంచి రూ.15వేల ధర కల్గిన డివైజ్ ల పెరుగుదలలో చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు లీ ఇకో, కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన లెనోవో, ఓపో, ఎల్ జీ, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, వివో, ఎల్ వైఎఫ్ (ఆర్ జియో) ఉన్నాయని రిపోర్టు నివేదించింది. సగటున స్మార్ట్ ఫోన్ అమ్మకాల ధరలు కూడా పెరిగాయని తెలిపింది. 2015 నాలుగో త్రైమాసికంలో రూ.12,285గా ఉన్న కనీస అమ్మక ధర ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.12,983గా నమోదైంది.
మొత్తం భారత మార్కెట్లో శ్యామ్ సంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ లు టాప్-3లో నిలిచాయని పేర్కొంది. గ్లోబల్ ప్లేయర్లు ఎక్కువగా 4జీ ఎల్ టీఈ టెక్నాలజీపై దృష్టిసారిస్తుండగా... దేశీయ మొబైల్ తయారీదారులు 3జీ టెక్నాలజీపైనే లాభాలను ఆర్జిస్తున్నారని రిపోర్టు నివేదించింది.