చిన్న సంస్థలకు మొబైల్ ఆధారిత సేవలు | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థలకు మొబైల్ ఆధారిత సేవలు

Published Sat, Aug 23 2014 2:54 AM

Mobile-based services to small company

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ మాద్యమంతో చిన్న సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), ఉద్యోగార్థులను అనుసంధానించే దిశగా టీఎంఐ గ్రూప్ కొత్తగా జాబ్స్‌డైలాగ్ సేవలను ఆవిష్కరించింది. సమీప ప్రాంతాల్లో ఉద్యోగాలు కావాలనుకునే అభ్యర్థులకు, దగ్గర్లో ఉండే ఉద్యోగులను తీసుకోవాలనుకునే సంస్థలకు ఇది ఉపయోగపడుతుందని టీఎంఐ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి. మురళీధరన్ శుక్రవారం ఇక్కడ వివరించారు. రిక్రూట్‌మెంట్ తలపెట్టిన సంస్థలు తమ కంపెనీ వివరాలు, నియామకావసరాలను జాబ్స్‌డైలాగ్‌కి కాల్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ వివరాలతో ఆయా సంస్థల మైక్రోసైట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ. 3,000 నుంచి ప్యాకేజీలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగార్థులు మిస్డ్‌కాల్  ఇస్తే.. కాల్ సెంటర్ వారు తిరిగి ఫోన్ చేసి వివరాలు తీసుకుని, ప్రొఫైల్ తయారుచేస్తారని మురళీధరన్ చెప్పారు. ఇది పూర్తిగా ఉచితమన్నారు. అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న సంస్థలు.. నియామకాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. తొలి ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1,100 పైచిలుకు సంస్థలు,  నాలుగు వేల నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జాబ్స్‌డైలాగ్‌ను కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా అధికారికంగా ఈ నెల 26న ప్రారంభిస్తారని చెప్పారు.  

Advertisement
Advertisement