ముంబై : దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కు కొత్తగా సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సలీల్ పరేఖ్ వేతనాన్ని కంపెనీ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పిక్స్డ్ శాలరీ కింద ఈయన రూ.6.5 కోట్లను అందుకోనున్నారని, రూ.9.75 కోట్లను వేరియబుల్ చెల్లింపులు కింద పొందనున్నారని స్వతంత్ర బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందర్ షా తెలిపారు. అంటే మొత్తంగా శాలరీ, వేరియబుల్ పే కింద రూ.16.25 కోట్లను పొందనున్నారు. మంగళవారం నుంచి ఇన్ఫోసిస్ సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్గా పరేఖ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీలో కిరణ్ మజుందర్ షా ఒక సభ్యురాలు.
నియంత్రిత స్టాక్ యూనిట్ల కింద కొత్త సీఈవో మరో రూ. 3.25 కోట్లను పొందనున్నారని, అదేవిధంగా వార్షిక పనితీరు కింద అందజేసే ఈక్విటీ గ్రాంట్లు రూ.13 కోట్లుగా ఉండనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక ఒక్కసారి ఈక్విటీ గ్రాంట్ కింద పరేఖ్కు రూ.9.75 కోట్లు అందజేయనున్నట్టు చెప్పారు. ఇన్ఫీకి అంతకముందు సీఈవోగా ఉన్న విశాల్ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు. సిక్కా వేతనం విషయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సిక్కా హఠాత్తుగా రాజీనామా చేశారు. పరేఖ్ ఎంప్లాయీమెంట్ కాంట్రాక్ట్ నాన్-కంపీట్ క్లాజ్ కిందకు రానుంది.