వడోదర: మార్చి 15న తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె పిలుపును బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక (యూఎఫ్బీయూ) విరమించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో భారీ కుంభకోణం, ఈ నేపథ్యంలో బ్యాంకింగ్కు సంబంధించి నెలకొన్న అస్పష్ట పరిస్థితుల వంటి అంశాలు సమ్మె పిలుపు విరమణకు కారణమని యూఎఫ్బీయూ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.
సమావేశ ముఖ్యాంశాలు...
గత వారం చివర్లో్ల సమావేశం అయిన యూఎఫ్బీయూ పలు అంశాలను చర్చించిందని సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ అంశాలు చూస్తే...
♦ పీఎన్బీలో జరిగిన స్కామ్పై లోతుగా విచారణ చేయకుండా, కేవలం దిగువస్థాయి ఉద్యోగులదే దీనికి బాధ్యత అన్నట్లు వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుండడం తగదు
♦ బ్యాంక్ నిర్వహణా వ్యవస్థ సామర్థ్యం తగిన విధంగా లేదన్నది సమావేశం అభిప్రాయం. నియంత్రణ, పర్యవేక్షణ, నిర్వహణ వంటి అంశాల్లో పూర్తి నిర్లక్ష్యం ఉందన్న విషయాన్ని ఎవ్వరూ దాచిపెట్టలేరు. పీఎన్బీ ఉన్నతాధికారులతోసహా వివిధ అత్యున్నత స్థాయిల్లో నైతికత లోపిస్తోంది. ఆయా పరిస్థితులు అన్నింటిపై సమగ్ర సమీక్ష జరిపి, బ్యాంకింగ్ పటిష్టతకు చర్యలు అవసరం.
♦ ఆర్బీఐ పర్యవేక్షణా వ్యవస్థ పాత్ర కూడా స్పష్టం కావాల్సి ఉంది.