60 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

60 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Published Sat, Nov 9 2019 5:59 AM

 Over 60K Apply For VRS In BSNL/MTNL In 4 Days - Sakshi

న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్‌ఎస్‌) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 60,000 దాటింది. టెలికం సెక్రటరీ అన్‌షూ ప్రకాశ్‌ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కుపైగా ఉందని, ఎంటీఎన్‌ఎల్‌ సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే ఇది 60,000 దాటుతోందని ఆయన తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఒక్క శుక్రవారం మధ్యాహా్ననికే వీఆర్‌ఎస్‌కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్య 40,000 నుంచి 57,000కు చేరిందని సమాచారం. వీఆర్‌ఎస్‌  పథకానికి స్పందన ‘‘అసాధారణం’’ అని ఆయన పేర్కొన్నారు.  94,000 మందికి వీఆర్‌ఎస్‌ ఇవ్వాన్నది ప్రభుత్వ లక్ష్యంగా సైతం ఆయన సూచించారు.   

స్పందన బాగుంది: బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ
అంతక్రితం బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పీకే పుర్వార్‌  మాట్లాడుతూ, సంస్థలో వీఆర్‌ఎస్‌ కింద ఇప్పటికి 40,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  ‘‘ఇప్పటి వరకూ 40,000కుపైగా దరఖాస్తులు వస్తే, ఇందులో 26,000 మంది గ్రూప్‌ ‘సీ’కి చెందినవారు. అన్ని కేడర్ల నుంచీ పథకానికి స్పందన బాగుంది’’ అని పుర్వార్‌ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి నవంబర్‌ 5 నుంచి అమల్లోకి వచి్చన ఈ పథకం డిసెంబర్‌ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది వీఆర్‌ఎస్‌ ప్రయోజనం పొందడానికి అర్హులు.

70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది. కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌  ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ.40,000 కోట్ల పైగా ఉంది.   

Advertisement
Advertisement