రైల్వే మరో నిర్ణయం : ఆ టిక్కెట్లు రద్దు | Sakshi
Sakshi News home page

రైల్వే మరో నిర్ణయం : ఆ టిక్కెట్లు రద్దు

Published Mon, Mar 12 2018 12:15 PM

Railways Discontinues Online Booking Of I-Tickets From March 1 - Sakshi

చెన్నై : దేశీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐ-టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని దేశీయ రైల్వే నిర్ణయించింది. తన వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ ద్వారా నిర్వహించే ఐ-టిక్కెట్‌​ బుకింగ్‌ను మార్చి 1 నుంచి విత్‌డ్రా చేయాలని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఆర్‌సీటీసీ) నిర్ణయించిందని రైల్వే వర్గాలు చెప్పాయి. ఈ టిక్కెట్ల విక్రయాన్ని ఐఆర్‌సీటీసీ 2002లో ప్రారంభించింది. ఐఆర్‌సీటీసీ వద్ద ఐ-టిక్కెట్ల బుకింగ్‌, కౌంటర్ల వద్ద పేపర్‌ టిక్కెట్ల బుకింగ్‌ ఒకే విధమైనవి. అయితే ఐ-టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో ప్యాసెంజర్‌ తన అడ్రస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్‌ ఇచ్చిన అడ్రస్‌కు ఈ టిక్కెట్‌ను ఐఆర్‌సీటీసీ హోమ్‌ డెలివరీ చేస్తోంది. వీటి బుకింగ్‌ సమయంలో స్లీపర్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ టిక్కెట్‌కు 80 రూపాయలు, ఏసీ క్లాస్‌ టిక్కెట్‌కు 120 ఛార్జీ విధిస్తారు. 

చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, మైసూరు, మంగళూరు, మధురై, కోయంబత్తూరు వంటి నగరాలు జర్నీకి రెండు రోజుల ముందు ఈ ఐ-టిక్కెట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర నగరాలు అయితే మూడు రోజులు ముందస్తుగా వీటిని బుక్‌ చేసుకోవాలి. ఐ-టిక్కెట్‌ సర్వీసును ముఖ్యంగా ప్రింటవుట్‌ తీసుకోలేని ప్రయాణికుల ప్రయోజనార్థం ఆఫర్‌ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వీటిని అందించేవారు. అవుట్‌ స్టేషన్లలో ఉండే ప్రజలు అంగవైకల్యం, వయసు పైబడిని ప్రయాణికుల కోసం టిక్కెట్లను బుక్‌ చేయడానికి ఈ సర్వీసులనే వినియోగించేవారు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఎస్‌ఎంఎస్‌లను వాలిడ్‌గా పరిగణలోకి తీసుకొంటోంది. అవుట్‌స్టేషన్లలో ఉన్న వారు, తమ కుటుంబసభ్యుల కోసం టిక్కెట్లను బుక్‌ చేసి, ఆ టిక్కెట్‌ వివరాలను మొబైల్‌ ఫోన్లకు పంపించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వర్గాల నుంచే కాకుండా ఇతర మొబైల్‌ ఫోన్ల నుంచి రిసీవ్‌ చేసుకున్న ఎస్‌ఎంఎస్‌లు కూడా వాలిడ్‌నని రైల్వే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఛార్ట్‌లో ఐడీ ఫ్రూప్‌ సరిపోవడంతో పాటు, అదే బెర్త్‌ను ఇతర ప్రయాణికులు తమదే అనకుండా ఉండాల్సి ఉంటుందని సీనియర్‌ అధికారి చెప్పారు. 
 

Advertisement
Advertisement