బుల్ పరుగు వెనుక రహస్యమేంటి! | Sakshi
Sakshi News home page

బుల్ పరుగు వెనుక రహస్యమేంటి!

Published Thu, Nov 6 2014 1:27 PM

బుల్ పరుగు వెనుక రహస్యమేంటి! - Sakshi

దేశ యువతకే కాదు.. భారత స్టాక్ మార్కెట్ వ్యవస్థకు నరేంద్రమోడీ ఉత్తేజాన్ని అందించారు. ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందు స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ.. నిస్తేజంగా ఉండేవి. ఎప్పడైతే నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారో.. మోడీతోపాటు సూచీలు కూడా పరుగులు పెట్టాయి. 
 
నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టాక కూడా ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పరుగు ఆపలేదు. తాజాగా ప్రధాన సూచీలు రికార్డులను తిరగరాస్తూ.. సరికొత్త గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 28 వేల, నిఫ్టీ 8350 మార్కును తాకాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అంటే అక్టోబర్ 16 తేది నుంచి కేవలం 12 సెషన్స్ లో 2 వేల పాయింట్ల ర్యాలీని కొనసాగించింది. 2014 సంవత్సరాంతానికి సెన్సెక్స్ 30 వేల మార్కును చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009 తర్వాత ఇంత వేగంగా బుల్ ర్యాలీ కొనసాగడం ఇదే ప్రథమం. 
 
స్టాక్ మార్కెట్ లో బుల్ మార్కెట్ ర్యాలీ కొనసాగడం వెనుక కారణాలు పరిశీలిద్దాం!
 
*సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీకి 30 శాతం మేరకు విదేశీ నిధుల ప్రవాహమే కారణమని అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 30 నాటికి 294 బిలియన్ల డాలర్ల మేరకు నిధుల ప్రవాహం కొనసాగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత దేశ వ్యాపార రంగ చరిత్రలో విదేశీ ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. 
 
' అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గముఖం పెట్టడం కూడా సూచీలు పరుగు పెట్టడానికి కారణమని తెలుస్తోంది. క్రూడ్ ధరలు క్షీణించడంతో డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గి ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి రావోచ్చని అంచనా వేస్తున్నారు. 
 
' వచ్చే త్రైమాసిక పరపతి ద్రవ్య సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే ఊహాగానాలతో బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో సానుకూలత కనిపించింది. దాంతో బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
* ఈ సంవత్సరం 84 వేల కోట్ల రూపాయల మేరకు భారతీయ ఈక్వీటిల వాటాలను కొనుగోలు చేసినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement