జియోకు ఇక ప్రత్యర్థుల సవాల్.. ! | Sakshi
Sakshi News home page

జియోకు ఇక ప్రత్యర్థుల సవాల్.. !

Published Sat, Oct 8 2016 1:14 AM

జియోకు ఇక ప్రత్యర్థుల సవాల్.. !

చేతిలో తగినంత 4జీ స్పెక్ట్రమ్
పోటీతో వినియోగదారులకు ప్రయోజనం!

న్యూఢిల్లీ/ముంబై: దేశవ్యాప్తంగా 4జీ స్పెక్ట్రమ్‌తో, భారీ స్థాయి పెట్టుబడులతో, సేవల ప్రారంభానికి ముందే ఉచిత ఆఫర్లతో... టెలికం రంగంలో అప్పటికే పాతుకుపోయిన దిగ్గజాల వెన్నులో రిలయన్స్ జియో వణుకు పుట్టించింది. కానీ ఇప్పుడు ప్రత్యర్థి టెల్కోలు కూడా జియోతో ముఖాముఖి తేల్చుకునేందుకు తాజా వేలంలో తగినంత స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి. ఇందుకోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నాయి. జియోతో పోటీ పడి కస్టమర్లను ఆకర్షించేందుకు సరిపడా శక్తిని టెల్కోలు సమకూర్చుకున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. తాజా వేలం అనంతరం సేవలు మరింత మెరుగుపడతాయని కేంద్రం మాత్రం ఆశిస్తోంది.

 కేంద్రం అంచనాలు తల్లకిందులు 
కేంద్ర టెలికం శాఖ ఈ నెల 1 నుంచి భారీ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించింది. తక్కువ స్పందనతో ఐదు రోజుల పాటు సాగిన ఈ వేలం చివరికి గురువారంతో ముగిసింది. 5.6 లక్షల కోట్లు వస్తాయని కేంద్రం అంచనా వేసింది. కానీ, ఇప్పటికే భారీగా రుణ భారాన్ని ఎదుర్కొంటున్న టెలికం కంపెనీలు తాజా వేలంలో దూకుడుగా వెళ్లలేదు. ఆచితూచి వ్యవహరించడంతో ప్రభుత్వానికి కేవలం రూ.65,789 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కోసమే బిడ్లు వచ్చాయి. 700, 900 మెగాహెర్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ కోసం అసలు ఒక్క బిడ్ కూడా రాలేదు. వీటి ఖరీదు అధికంగా ఉన్నందున కంపెనీలు దూరంగా ఉండిపోయాయి.

కంపెనీల తాజా కొనుగోళ్లు
భారతీ ఎయిర్‌టెల్ రూ.14,244 కోట్లతో 1800, 2100, 2300 మెగాహెర్జ్ బ్యాండ్‌లలో 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. కేరళ, అసోం, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై, నార్త్‌ఈస్ట్ సర్కిళ్లలో స్పెక్ట్రమ్ లభించింది.

ఐడియా రూ.12,798 కోట్లతో 1800, 2100, 2300, 2500 మెగాహెర్జ్ బ్యాండ్‌లలో మొత్తం 349.20 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. దీంతో తాను సొంతంగానే దేశవ్యాప్తంగా 20 సర్కిళ్లలో 4జీ సర్వీసులను ఐడియా అందించగలదు.

వొడాఫోన్ ఇండియా రూ.20,280 కోట్ల వ్యయంతో 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. 17 సర్కిళ్లలో 4జీ సేవలను అందించే శక్తిని సమకూర్చుకుంది.

విశ్లేషకులు ఏమంటున్నారు..?
‘జియోకు కౌంటర్ ఇవ్వడానికి మొదటి మూడు టెలికం కంపెనీలు (ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా) తగినంత 4జీ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో చందాదారులను ఆకర్షించే విషయంలో మరింత పోటీ పడనున్నాయి’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ పేర్కొంది. అయితే, జియోతో పోలిస్తే ఇప్పటికీ ఒక గిగాహెర్జ్ 4జీ బ్యాండ్ కొరతను ప్రధాన మూడు టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్నాయని, ఈ దృష్ట్యా ఇవి భవిష్యత్తులో 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేయవచ్చని తెలిపింది. డిమాండ్ లేనందున 700/900 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ధరను ప్రభు త్వం తగ్గిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

‘టెలికం కంపెనీలు డేటా అధికంగా వినియోగంచే సర్కిళ్లలో విపరీతమైన రద్దీని ఎదుర్కొంటున్నాయి. ఈ దృష్ట్యా తాజాగా కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌ను 4జీ సేవలకు వినియోగిస్తాయి’ అని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. డేటాలో ఉన్న వృద్ధిని సొంతం చేసుకుని, జియోతో పోటీపడడం కోసం ఐడియా, వొడాఫోన్ ఈ వేలంలో భారీ వ్యయంతో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయని క్రిసిల్ సీనియర్ డెరైక్టర్ ప్రసాద్ కొపార్కర్ అన్నారు. టెలికం సేవల ద్వారా వచ్చే ఆదాయంలో నాలుగింట మూడో వంతు మొదటి మూడు టెలికం కంపెనీలకు చెందినదేనని, వచ్చే రెండేళ్లలో నెట్‌వర్క్ విస్తరణకు ఇవి రూ.80వేల కోట్లు వ్యయం చేయనున్నాయని క్రిసిల్ మరో డెరైక్టర్ అజయ్ శ్రీనివాసన్ చెప్పారు.

స్పెక్ట్రమ్ ఫ్లాప్.. ఆదాయ అంచనాలపై పడదు: నొమురా
స్పెక్ట్రమ్ వేలానికి స్పందన ఊహించినంత లేకపోవడంతో అంచనా వేసిన దానికంటే రూ.32వేల కోట్ల ఆదాయ లోటు ఉందని, అయినప్పటికీ ప్రభుత్వ ఆర్థిక అంచనాలపై దీని ప్రభావం ఉండదని జపాన్ బ్రోకరేజీ సంస్థ నొమురా పేర్కొంది. పరోక్ష పన్నుల వసూళ్లు అంచనా వేసిన దాని కంటే అధికంగా (రూ.30వేల కోట్లు) ఉండడం, నల్లధనం వెల్లడి కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వ ఖజానా నిండుతుందని తెలిపింది. స్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ.64వేల కోట్లతోపాటు టెలికం శాఖ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.99వేల కోట్ల ఆదాయాన్ని కేంద్ర సర్కారు అంచనా వేసింది.

Advertisement
Advertisement