త్వరలో 20 రూపాయిల నోట్లు: ఆర్బీఐ | Sakshi
Sakshi News home page

త్వరలో 20 రూపాయిల నోట్లు: ఆర్బీఐ

Published Wed, Jul 19 2017 7:09 PM

త్వరలో 20 రూపాయిల నోట్లు: ఆర్బీఐ - Sakshi

ముంబై : పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్‌లో నెలకొన్న చిన్న నోట్ల కొరతకు ఆర్బీఐ క్రమక్రమంగా చెక్‌ పెడుతోంది. తాజాగా త్వరలో మహాత్మాగాంధీ సిరీస్‌ 2005లో కొత్త రూ.20 బ్యాంకు నోట్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ కొత్త నోట్లు నెంబర్‌ ప్యానల్‌లో 'ఎస్‌' అనే ఇన్‌సెట్‌ లెటర్‌ను కలిగి ఉండి, ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో మార్కెట్‌లోకి విడుదల చేస్తామని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
రెండు నెంబర్‌ ప్యానల్స్‌లోనూ ఇన్‌సెట్‌ లెటర్‌ 'ఎస్‌' ఉంటుందని ఆర్బీఐ చెప్పింది. ఈ నోట్లు ఇప్పుడు మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.20 నోట్ల మాదిరి డిజైన్‌నే కలిగి ఉండనున్నాయని కూడా ఈ ప్రకటనలో పేర్కొంది. అంతకముందు ఆర్బీఐ జారీచేసిన 20 రూపాయిల నోట్లను కూడా చట్టబద్ధమైనవిగానే కొనసాగిస్తామని  తెలిపింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement