న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ దేశంలో తయారీ యూనిట్ ఏర్పాటుకు గాను రాయితీలు కావాలంటూ చేసిన డిమాండ్లలో చాలా వాటికి ఆమోదం తెలుపలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్లో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు యాపిల్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించటం తెలిసిందే. అయితే, ఆర్థిక పరమైన రాయితీలను, దిగుమతి చేసుకునే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీలను ఎత్తివేయాలంటూ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది.
ఈ నేపథ్యంలో యాపిల్ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించిందా? అన్న ప్రశ్న రాజ్యసభలో ఎదురుకాగా బుధవారం దీనికి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. తయారీ, రిపెయిర్ యూనిట్లు, కాంపోనెంట్లు, క్యాపిటల్ ఎక్విప్మెంట్, స్మార్ట్ఫోన్ తయారీకి అవసరమైన కన్జ్యూమబుల్స్, సర్వీస్పై 15 ఏళ్ల పాటు డ్యూటీ మినహాయింపును యాపిల్ ఇండియా కోరిందని ఆమె చెప్పారు.