ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ అదరగొట్టింది! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ అదరగొట్టింది!

Published Fri, May 19 2017 1:14 PM

ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ అదరగొట్టింది!

న్యూఢిల్లీ :  ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ 4 లాభాల్లో అదరగొట్టింది. స్టాండలోన్ నికర లాభాలను మార్చి క్వార్టర్ లో 123 శాతం పెంచుకుని రూ.2,812.82 కోట్లగా నమోదుచేసింది. ఈ లాభాలు విశ్లేషకులు అంచనాలను కూడా అధిగమించాయి. బ్యాంకు లాభాలు రూ.2,701 కోట్లగా మాత్రమే ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఎస్బీఐ లాభాలు రూ.1,263.81 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయాలు కూడా బ్యాంకువి ఏడాది ఏడాదికి 17.3 శాతం పెరిగాయి. మార్చితో ముగిసిన క్వార్టర్ లో ఈ ఆదాయాలు రూ.18,070.7 కోట్లగా నమోదుచేసింది.  
 
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయాలు రూ.15,401.30 కోట్లగా ఉన్నట్టు రిపోర్టు చేసింది. క్వార్టర్ క్వార్టర్ కు  అసెట్ క్వాలిటీని బ్యాంకు మెరుగుపరుచుకుంది. డిసెంబర్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ లో స్థూల నిరర్థక ఆస్తులు కూడా 6.90 శాతానికి దిగొచ్చాయి. నికర ఎన్పీఏలు కూడా డిసెంబర్ క్వార్టర్ కంటే తక్కువగానే నమోదయ్యాయి. డిసెంబర్ క్వార్టర్ లో 4.24గా ఉన్న ఎన్పీఏలు ఈ క్వార్టర్ లో3.71 శాతంగా రికార్డయ్యాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో కూడా బ్యాంకు నికర ఎన్పీఏలు 3.71 శాతమే.  లాభాల్లో అదరగొట్టడంతో ఎస్ బీఐ షేరు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ లో బ్యాంకు షేరు టాప్ గెయినర్ గా లాభాలు పండిస్తోంది. 2.3 శాతం జంప్ చేసిన షేర్ ధర రూ.310 ని తాకింది. 

Advertisement
Advertisement