ముంబై : చివరి గంట ట్రేడింగ్ మార్కెట్లు అదుర్స్ అనిపించాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు జంప్ చేసి 35,689.6 వద్ద క్లోజ్ కాగ, నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 10,822 వద్ద క్లోజైంది. సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహింద్రా అండ్ మహింద్రా, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ 2 నుంచి 5 శాతం మేర ర్యాలీ జరిపాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, హెచ్యూఎల్లు 1 శాతం నుంచి 2.6 శాతం వరకు పెరిగాయి.
అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం 2 శాతం మేర కిందకి పడిపోయాయి. హెచ్పీసీఎల్, యూపీఎల్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అయితే ట్రేడ్వార్ భయాలతో ప్రారంభంలో మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడయ్యాయి. కానీ ఆ భయాల నుంచి కాస్త విముక్తి పొంది, చివరి గంటలో జరిపిన కొనుగోళ్లతో, మార్కెట్లు పైకి ఎగిశాయి. మధ్యాహ్న ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ కూడా పెరిగింది. 18 పైసలు పెరిగి 67.80గా నమోదైంది. ఎగుమతిదారులు, బ్యాంక్లు అమెరికా కరెన్సీని ఎక్కువగా అమ్మడంతో, రూపాయి బలపడింది. ఆయిల్ సరఫరాలను ఒక్క ఎంబీపీడీని పెంచాలని సౌదీ ఆయిల్ మంత్రి ఖలిద్ అల్-ఫాలిహ్ ప్రతిపాదించారు. ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బట్టి దేశాలకు దీన్ని సరఫరా చేస్తామని తెలిపారు.