ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ప్రోత్సాహంతో దేశీయ స్టాక్మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సెంచరీతో బోణీ కొట్టింది. ప్రస్తుతం 131 పాయింట్ల లాభంలో 35,450 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 32 పాయింట్లు పెరిగి 10,773 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఐషర్ మోటార్స్, టెక్ మహింద్రాలు 2 శాతం లాభంతో టాప్ గెయినర్లుగా లాభాలు పండించాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండియన్ ఆయిల్ నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ మరింత పడిపోయి 30 పైసల నష్టంలో 67.38 వద్ద ట్రేడవుతోంది. ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో మరికొన్ని రోజులుగా రూపాయి విలువ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి.