ముంబై: ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 14.04 పాయింట్ల నష్టంలో 31,297.53 వద్ద, నిఫ్టీ 4.05 పాయింట్ల నష్టంలో 9653.50 వద్ద క్లోజయ్యాయి. నేటి ట్రేడింగ్ లో టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, టాటా పవర్ రెండు సూచీల్లోనూ లాభాలు పండించగా.. లుపిన్, యాక్సిస్ బ్యాంకు, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్ నష్టాలు పాలయ్యాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) రానుందనే వార్తల నేపథ్యంలో టాటా మోటార్స్ నేటి ఇంట్రాడేలో 4 శాతం మేర లాభాలు పండించింది. అయితే జాగ్వార్ ల్యాండ్ రోవర్ లిస్టు చేయడం లేదని, అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి ఆ రూమర్లను కొట్టిపారేశారు.
అమెరికా టెక్నాలజీ స్టాక్స్ పునరుద్ధరించుకోవడంతో దేశీయంగా కూడా ఐటీ కంపెనీల షేర్లు లాభాలు పండించాయి. ఇన్ఫోసిస్ ఎక్కువగా 1.7 శాతం లాభపడింది. టెక్ మహింద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీ షేర్లు కూడా 1.41 శాతం, 1.39 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీ షేర్ల పునరుద్ధరణతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.6 శాతం పైకి ఎగిసింది. పంజాబ్ ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీ ప్రకటించడంతో బ్యాంకింగ్ స్టాక్స్ పడిపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.26 శాతం, బీఎస్ఈ ఫైనాన్స్ ఇండెక్స్ 0.32 శాతం పడిపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.44గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 9 రూపాయల లాభంతో 28,551 రూపాయలుగా నమోదయ్యాయి.