సాక్షి, ముంబై : ఊగిసలాట ధోరణిలో కొనసాగిన స్టాక్మార్కెట్లు, ఆఖరికి లాభాలతో ముగిశాయి. 55.52 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 32,241 వద్ద, 7.30 పాయింట్ల లాభంలో 10,086 వద్ద నిఫ్టీ క్లోజయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొనుగోళ్లతో సూచీలు పైకి ఎగియగా.. ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా మిడ్సెషన్ నుంచి మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. టోకు ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్టానికి చేరుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బ తీసింది. అయితే మార్కెట్ సెంటిమెంట్ స్ట్రాంట్గా ఉండటంతో లోయర్ లెవల్స్లో కొనుగోళ్లు పెరిగాయి. నిఫ్టీ 10,100 మార్కును కూడా పునరుద్ధరించుకుంది. కానీ ఆ మార్కును ఆఖరి వరకు నిలబెట్టుకోలేకపోయింది.
ఫార్మా కౌంటర్లలో కొనసాగిన ర్యాలీ ఇవాళ మార్కెట్లను నిలబెట్టింది. సన్ ఫార్మా 4 శాతం ర్యాలీ నిర్వహించింది. సన్ఫార్మాతో పాటు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, గెయిల్, అరబిందో ఫార్మాలు లాభాల్లో నడిచాయి. ఉదయం సెషన్లో మంచి లాభాలను గడించిన చమురు షేర్లు ఆ తర్వాత భారీగా నష్టపోయాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 64.10వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 9 రూపాయలు నష్టం పాలైన, 29,877 రూపాయలుగా నమోదయ్యాయి.