ఇటలీలో రాజకీయ అనిశ్చితి, యూరో పతనం, ఊపందుకున్న బాండ్ల ఈల్డ్స్ దేశీ స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి. ఆందోళనకర పరిస్థితుల మధ్య ఎంట్రీ ఇచ్చిన సూచీల్లో వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో ప్రారంభంలోనే మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పతనమైంది. ప్రస్తుతం కాస్త కోలుకుని 151 పాయింట్ల నష్టంలో 34,798 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 49 పాయింట్ల వెనకడుగుతో 10,584 వద్ద కదలాడుతోంది. ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి.
వేదంత, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 2.5 శాతం వరకు కిందకి పడిపోయాయి. ఎం అండ్ ఎం, బీపీసీఎల్, ఇన్ఫోసిస్లు మాత్రమే ప్రారంభంలో లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 156 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంకు కూడా 237 పాయింట్లు ఢమాల్మంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా 43 పైసల లాభంలో 67.86 వద్ద ట్రేడవుతోంది. అటు ఆసియన్ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జపాన్ నిక్కీ, చైనా షాంఘై కాంపొజిట్, హాంకాంగ్ హాంగ్ సెంగ్, దక్షిణ కొరియా కొస్పీలు 1.5 శాతం నుంచి 2 శాతం వరకు కిందకి పడిపోయాయి.