సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కట్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల డబుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ చివరలో కూడా అదే జోష్ను కంటిన్యూ చేసింది. మధ్యలో కొంత ఒడిదుడుకులకు లోనైనా మిడ్ సెషన్ తరువాత కోలుకుని వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. మార్చి డెరివేటివ్ సిరీస్ తొలి రోజు ఇన్వెస్టర్లు కొనగోళ్లతో 36,000 పాయింట్ల మార్క్ను, నిఫ్టీ 10860 మార్క్కు ఎగువన ముగిసాయి. సెన్సెక్స్ 196 పాయింట్లు ఎగిసి 36063వద్ద , నిఫ్టీ 71పాయింట్లు లాభపడి 10863వద్ద స్థిరంగా ముగిశాయి. తద్వారా మార్చి డెరివేటివ్ కౌంటర్కు శుభారంభాన్నిచ్చాయి.
దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇంకా మీడియా, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్స్లో ఓబీసీ, యూనియన్ బ్యాంక్, సిండికేట్, బీవోబీ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లాభాలనార్జించాయి. ఇంకా హెచ్పీసీఎల్, టాటా మోటార్స్, యస్బ్యాంక్, ఇండస్ఇండ్, జీ, అదానీ పోర్ట్స్, వేదాంతా, ఐబీ హౌసింగ్, కోల్ ఇండియా, గ్రాసిమ్ టాప్ విన్నర్స్గా నిలవగా ,ఎయిర్టెల్, బజాజ్ ఆటో, యాక్సిస్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటన్, ఆర్ఐఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.