సాక్షి, ముంబై: కోవిడ్ -19 భయంతో ప్రపంచ ఈక్వీటీ మార్కెట్లు గజ గజ వణకుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో 465 పైగా కోల్పోయింది. దీంతో బెంచ్మార్క్ సూచికలు నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు డెరివేటివ్స్ కాంటాక్టు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తోడవ్వడంతో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 39,500 స్థాయిని, నిఫ్టీ 11600 స్థాయిని కోల్పోయాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా కీలకమైన 30వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొటున్నాయి.
బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోతున్నాయి. ఎం అండ్ ఎం, జెఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్, గెయిల్, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ భారీగా నష్టపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని అప్రమత్తంగా వుండాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. దేశీయ ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఉందో లేదో అనే అంశాన్ని తెలియజేసే ఈ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలు జీడీపీ గణాంకాలు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. జీడీపీ గణాంకాల బట్టి మార్కెట్ తదుపరి మూమెంట్ ఉండవచ్చు అని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.