నేడు మార్కెట్లు లాభాలతో ప్రారంభం! | Sakshi
Sakshi News home page

నేడు మార్కెట్లు లాభాలతో ప్రారంభం!

Published Thu, Jul 2 2020 8:51 AM

SGX Nifty indicates Market may open up - Sakshi

నేడు (2న) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 10,474 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,397 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  ఓవైపు కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం, మరోవైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ తయారీలో పురోగతి వంటి అంశాల నేపథ్యంలో బుధవారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 0.5-1 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి యధాప్రకారం ఒడిదొడుకులను చవిచూడవచ్చని భావిస్తున్నారు.

బ్యాంకింగ్‌ పుష్‌
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో బుధవారం తొలుత నెమ్మదిగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి పరుగందుకున్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరగడంతో వెనుదిరిగి చూడలేదు. వెరసి సెన్సెక్స్‌ 499 పాయింట్లు జంప్‌చేసి 35,414 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128 పాయింట్లు జమ చేసుకుని 10,430 వద్ద నిలిచింది. తద్వారా మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలో స్థిరపడ్డాయి.  

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,337 పాయింట్ల వద్ద, తదుపరి 10,245 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,485 పాయింట్ల వద్ద, ఆపై  10,540 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,486 పాయింట్ల వద్ద, తదుపరి 20,994 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,266 పాయింట్ల వద్ద, తదుపరి 22,553 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో  బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1696 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1377 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2000 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2051 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1937 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1036 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement