సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లకు వరుసగా అయిదవ సెషన్లో కూడా అమ్మకాల సెగ తగిలింది. మిడ్ సెషన్నుంచి, ముఖ్యంగా ఆఖరి అర్థగంటలో అమ్మకాల వెల్లువ కొనసాగడంతో దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిశాయి. దీంతో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల దిగువకు చేరాయి. ఒక దశలో సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా కోల్పోయింది. నిఫ్టీ10300 స్థాయిని, సెన్సెక్స్ 33500 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ 430 పాయింట్ల నష్టంతో 33,317 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల పతనంతో 10,249 వద్ద ముగిసింది. పీఎన్బీ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేలకోట్ల కుంభకోణాల నేపథ్యంలో హైయర్ లెవెల్స్లో ట్రేడర్ల లాభాల స్వీకరణ ఇండెక్స్ల పతనానికి కారణమని మార్కెట్ విశ్లేకులు భావిస్తున్నారు.
పీఎస్యూ, ఆల్కహాల్ షేర్ల భారీ నష్టాలతో పాటు ఐటీ, ఆటో, బ్యాంక్ నిఫ్టీ టాప్ లూజర్గా ఉంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ 3శాతానికిపై నష్టపోయాయి. అలాగే విజయాబ్యాంక్, సిండికేట్బ్యాంక్ , యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్, యునైటెడ్ బ్రెవరేజెస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర నష్టపోయాయి. వీటితోపాటు టాటా మోటార్స్, బజాజ్, మారుతి, అశోక్ లేలాండ్ కూడా భారీగా నష్టపోయాయి. మరోవైపు పీసీ జ్యుయలర్స్, బీపీసీసీఎల్, సన్ ఫార్మా, గ్లెన్మార్క్, అల్ట్రా సిమెంట్ సన్టీవీ లాంటివి లాభడ్డాయి.