దేశీయ స్టాక్మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. ఆరంభం లాభాలనుంచి కన్సాలిడేట్ అయ్యాయి. అయితే మిడ్ సెషన్ తరువాత లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న సైచీలకు అమ్మకాల సెగ భారీగా తగిలింది. దీంతో సెన్సెక్స్ 180 పాయింట్లు పతనమై 38, 877 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నీరసించి 11643 వద్ద ముగిసాయి. దీంతో కీలక సూచీలు రెండూ కీలక గరిష్టాల నుంచి వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్ 39వేల దిగువకు, నిఫ్టీ 11700 దిగువన క్లోజ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 271 పాయింట్లు కోల్పోయింది. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుతోపాటు బ్యాంకింగ్ షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూను రేపు ప్రకటించనున్ననేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగిందని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. అటు ఈ ఏడాది సగటుకంటే అధికం లేదా అధిక వర్షపాతానికి అవకాశాలు కనిపించడంలేదంటూ ప్రయివేట్ రంగ సంస్థ స్కైమెట్ తాజాగా పేర్కొంది. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నట్లు అభిప్రాయపడింది. దీంతో సగటుకంటే తక్కువగానే వర్షాలు పడవచ్చంటూ అంచనా వేసింది. దీంతో అప్రమత్తత అవసరమని ఎనలిస్టులు సూచించారు.
మరోవైపు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రేపు ప్రకటించనున్న రివ్యూలో 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు కోత ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరికొమంతమంది అయితే ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోతను కూడా అంచనా వేయడం విశేషం.