స్టాక్స్‌ వ్యూ | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Dec 11 2017 2:12 AM

Stocks view - Sakshi

గ్రీన్‌ఫ్లై ఇండస్ట్రీస్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ. 334      టార్గెట్‌ ధర: రూ.380

ఎందుకంటే: దేశీయ ఫ్లైవుడ్, వినీర్స్‌ మార్కెట్లో అతి పెద్ద కంపెనీ అయిన గ్రీన్‌ప్లే ఇండస్ట్రీస్‌..  ఆంధ్రప్రదేశ్‌లో రూ.750 కోట్ల పెట్టుబడితో ఎండీఎఫ్‌(మీడియమ్‌ డెన్సిటీ ఫైబర్‌బోర్డ్‌) ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్‌తో దక్షిణ భారత దేశ డిమాండ్‌ను తీర్చవచ్చని భావిస్తున్న  ఈ కొత్త ప్లాంట్‌ కారణంగా ఎండీఎఫ్‌ విభాగం ఆదాయం మూడేళ్లలో 34 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇక ప్లైవుడ్‌ విభాగం ఆదాయం రెండేళ్లలో 12–15 శాతం చొప్పున చక్రగతి వృద్ధి చెందనున్నాదని భావిస్తున్నాం.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ–వే బిల్లు విధానం అమల్లోకి రానున్నది. ఫలితంగా మార్కెట్‌ వాటా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగానికి తరలనున్నది. ఇది సంఘటిత రంగంలోని గ్రీన్‌ప్లే ఇండస్ట్రీస్‌ వంటి కంపెనీలకు ప్రయోజనకరం. మొత్తం మీద మూడేళ్లలో కంపెనీ ఆదాయం 20 శాతం, నికర లాభం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలవని అంచనా. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఎండీఎఫ్‌ ప్లాంట్‌ వచ్చే ఏడాది జూలై కల్లా అందుబాటులోకి రానునుండడం, జీఎస్‌టీ అమలు కారణంగా రెండేళ్లలో ప్లైఉడ్‌ విభాగం అమ్మకాలు 12–15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలు, ఉత్తర ప్రదేశ్‌లోని కొత్త ప్లైఉడ్‌ ప్లాంట్, గుజరాత్‌లోని డెకరేటివ్‌ వినీర్‌ యూనిట్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ3 కల్లా అందుబాటులోకి రానుండడం, జీఎస్‌టీ రేట్లు 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడం....ఇవన్నీ సానుకూలాంశాలు. పోటీ తీవ్రంగా ఉండడం, భవిష్యత్తులో ధరలు తగ్గించే అవకాశాలుండడం వంటి కారణాల వల్ల ఎండీఎఫ్‌ విభాగం ఇబిటా మార్జిన్లు ఒకింత తగ్గవచ్చు. 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌ ధరకు 20 రెట్ల ధరను టార్గెట్‌ ధర, రూ.380గా నిర్ణయించాం.


హావెల్స్‌ ఇండియా - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌  
ప్రస్తుత ధర: రూ. 536          టార్గెట్‌ ధర: రూ.590

ఎందుకంటే: కొత్త కొత్త కేటగిరీల్లో ఉత్పత్తులను అందించడం ద్వారా వృద్ధి జోరును కొనసాగిస్తోంది. 2003లో లైటింగ్స్, 2005లో ప్రీమియమ్‌ ఫ్యాన్స్, 2010లో వాటర్‌ హీటర్స్, 2014లో ఎయిర్‌ కూలర్స్‌.. ఇలా కొత్త కొత్త కేటగిరీ ఉత్పత్తులను అందిస్తూ మంచి వృద్ధిని సాధిస్తోంది. ఇటీవల లాయిడ్‌ ఎలక్ట్రిక్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. దీంతో టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్ల వంటి వినియోగదారుల వస్తువుల సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. 

డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తోంది. కొన్ని ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులపై జీఎస్‌టీ పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో కంపెనీ మార్కెట్‌ వాటా పెరిగే అవకాశాలున్నాయి. వినియోగ వస్తువులపై కూడా పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గే అవకాశాలున్నాయన్న అంచనాల కారణంగా రానున్న సీజన్‌లో లాయిడ్స్‌ ఏసీ అమ్మకాలు పుంజుకోగలవని, జీఎస్‌టీ రేటు తగ్గింపు ప్రభావం సానుకూల ప్రభావం చూపగలదని భావిస్తున్నాం. ఎల్‌ఈడీ బల్బులు, ఫ్యాన్లను సబ్సిడీ ధరలకు అందించిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌(ఈఈఎస్‌ఎల్‌) ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్మార్ట్‌  మీటర్లు, సోలార్‌ రూఫ్‌టాప్స్‌పై తన దృష్టిని కేంద్రీకరించడంతో ఎల్‌ఈడీ బల్బుల ధరలు స్థిరీకరణ చెందుతున్నాయి.

పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కారణంగా కుదేలైన ఇబిటా మార్జిన్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.  కేబుల్స్, వైర్లు, స్విచ్‌ల విభాగాల్లో మార్కెట్‌ వాటా మరింతగా పెరగగలదని భావిస్తున్నాం. మూడేళ్లలో కంపెనీ ఈపీఎస్‌ 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 22 శాతంగా ఉండగలదని భావిస్తున్నాం. వినియోగవస్తువుల మార్కెట్లో కొత్త కంపెనీల ప్రవేశం కారణంగా పోటీ తీవ్రత పెరిగే అవకాశం, ముడి పదార్థాల ధరలు పెరిగే అవకాశాలు.. ప్రతికూలాంశాలు.

Advertisement
Advertisement