2021 నాటికి 2 లక్షల కోట్ల ఆదాయం | Sakshi
Sakshi News home page

2021 నాటికి 2 లక్షల కోట్ల ఆదాయం

Published Sat, Aug 27 2016 2:01 AM

2021 నాటికి 2 లక్షల కోట్ల ఆదాయం

లార్సెన్ అండ్ టూబ్రో చైర్మన్ నాయక్

 ముంబై: ఇంజినీరింగ్, నిర్మాణ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్‌టీ) 2020-21 నాటికి రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. చైర్మన్ ఏఎం నాయక్  ఇక్కడ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే యేడాది పదవీ విరమణ చేయనున్న  నాయక్ 71వ వార్షిక సాధారణ సమావేశం  (ఏజీఎం) సందర్భంగా షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కంపెనీతో నాలుగు దశాబ్దాల సంబంధం ఉన్న ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలను చూస్తే...

మార్జిన్‌లలో ఎటువంటి రాజీ లేకుండా ఆదాయ లక్ష్యాలను సాధించాలన్నది కంపెనీ లక్ష్యం. వార్షికంగా ఆర్డర్ బుక్‌ను రూ.2.5 లక్షల కోట్లకు అభివృద్ధి చేసుకోసుకోవడంపై కంపెనీ దృష్టి సారించింది. లక్ష్యాలను సాధించే విధంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊపందుకుంటుందని భావిస్తున్నా.

కంపెనీ భారీ వృద్ధికి సంబంధించి కొన్ని ప్రత్యేక రంగాలపై దృష్టి సారిస్తోంది. ఐటీ, టెక్నాలజీ సేవలు, రక్షణ, స్మార్ట్ వరల్డ్, వాటర్ మేనేజ్‌మెంట్ ఇందులో ఉన్నాయి.

డిజిటల్ విభాగంలో సాధించే ప్రగతి మున్ముందు కంపెనీకి లాభదాయకం కానుంది. ఇందులో గ్రూప్ కంపెనీలు ఎల్ అండ్‌టీ ఇన్‌ఫ్రా, ఎల్ అండ్ టీ టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తాయి.

వృద్ధి సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. మౌలిక రంగంపై కేంద్రం దృష్టి సారించడం కంపెనీకి లాభించే అంశం. అలాగే రక్షణ రంగంలో సంస్కరణలు రానున్న 10 సంవత్సరాల్లో కంపెనీకి 13 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. ఇక అణు ఇంధనానికి సంబంధించి కంపెనీకి మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసం ఉంది.

కాగా 2016 మార్చితో ముగిసిన కాలానికి కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,03,522 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 12 శాతం అధికం.  కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రం 7 శాతం వృద్ధితో రూ.5,091 కోట్లకు పెరిగింది.

Advertisement
Advertisement