అసలు నీరవ్‌ మోదీ ఎక్కడున్నట్టు? | Sakshi
Sakshi News home page

అసలు నీరవ్‌ మోదీ ఎక్కడున్నట్టు?

Published Fri, Mar 2 2018 4:48 PM

US Says It Cannot Confirm Reports Whether Nirav Modi Is In America - Sakshi

డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ అసలు ఎక్కడున్నట్టు? పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.12,676 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు చెక్కేసిన ఆయన ఎక్కడ తలదాచుకున్నట్టు? న్యూయార్క్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఉన్నాడని, అక్కడ జల్సా లైఫ్‌ జీవిస్తున్నాడని రిపోర్టులు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు బెల్జియం పారిపోయినట్టు తెలిసింది. అయితే ఇండియా మోస్ట్ వాంటెడ్ నీరవ్ మోదీ తమ దేశంలో ఉన్నాడో లేడో చెప్పలేమని అమెరికా ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మధ్యే మీడియాలో నీరవ్ మోదీ అమెరికాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ధృవీకరించలేం అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. మరి అతన్ని పట్టుకోవడానికి మీరు భారత ప్రభుత్వానికి సాయం చేస్తున్నారా అని ప్రశ్నించగా.. ఆ పని న్యాయశాఖ చూసుకుంటుందని చెప్పారు. ఈ విషయంపై స్పందించడానికి న్యాయశాఖ నిరాకరించింది. 

మోదీ, అతని అసోసియేట్స్‌ కలిసి పీఎన్‌బీలో లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ ద్వారా రూ.12,767 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లు కలిసి ఈ కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశాయి. పీఎన్‌బీ నుంచి సీబీఐ ఫిర్యాదు అందుకోక ముందే నీరవ్‌ మోదీ, అతని కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చౌక్సి దేశం విడిచి పారిపోయారు. ఈ కుంభకోణ కేసులో విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించినా.. నీరవ్‌ మోదీ తాను విచారణకు హాజరుకాలేనంటూ తేల్చిచెప్పేశాడు. మోదీ, చౌక్సిలకు వ్యతిరేకండా లుక్‌ అవుట్‌ నోటీసు(బ్లూ కార్నర్‌ నోటీసు) జారీ అయింది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement