హైదరాబాద్‌లో ‘ఇమేజ్‌’ సెంటర్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘ఇమేజ్‌’ సెంటర్‌

Published Tue, Feb 18 2020 7:36 AM

VFX And Gaming Sector Image Center in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, కంప్యూటర్‌ విజన్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల కోసం భారత్‌లో తొలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ‘ఇమేజ్‌’ పేరుతో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) దీనిని నెలకొల్పింది. ఈ రంగాల్లో మేధో సంపత్తిపై దృష్టిసారించిన కంపెనీలకు ఇది తొలి ఇంక్యు బేషన్‌ సెంటర్‌ కావడం విశేషం. ఎస్‌టీపీఐ ఫెసిలిటీలో 10,000 చదరపు అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు. ఏటా 25–30 స్టార్టప్స్‌కు ఇక్కడ అవకాశం కల్పిస్తామని ఎస్‌టీపీఐ డీజీ ఓంకార్‌ రాయ్‌ తెలిపారు. అయిదేళ్ల కాలానికిగాను రూ.19.68 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 28 ఎక్సలెన్స్‌ కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటికే ఏడు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 21 సెంటర్లు పలు దశల్లో ఉన్నాయని వివరించారు. ఇమేజ్‌ కేంద్రంలో చోటు కోసం మార్చి 31లోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన దరఖాస్తుదారులకు రూ.5 లక్షల సీడ్‌ ఫండ్‌ ఇస్తారు. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్, హైదరాబాద్‌ ఏంజిల్స్, హైసియా, ఐఐఐటీ హైదరాబాద్, టై హైదరాబాద్‌తో ఇమేజ్‌ కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకుంది. కాగా, ఎస్‌టీపీఐ నుంచి ఎగుమతులు 2018–19లో రూ.4,24,000 కోట్లు నమోదైంది. 2019–20లో 10 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఓంకార్‌ రాయ్‌ తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement