భారీగా పెరిగిన వోడాఫోన్‌ ఐడియా నష్టం | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన వోడాఫోన్‌ ఐడియా నష్టం

Published Thu, Feb 13 2020 8:23 PM

Voda Idea losses widen to Rs 6,439 cr in Dec quarter - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ వోడాఫోన్‌  ఐడియా  డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది.  2019-20 మూడవ త్రైమాసికంలో వోడా ఐడియా నష్టాలు రూ .6,439 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 50,922లు. పెరిగిన ఆర్థిక ఖర్చులు, ఆస్తుల విలువ క్షీణత ప్రభావం చూపినట్టు కంపెనీ తెలిపింది. గురువారం ప్రకటించిన  క్యూ3 ఫలితాల్లో  వోడాఫోన్‌  ఐడియా మొత్తం ఆదాయం 5 శాతం తగ్గి రూ .11,381 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో ఇది రూ. 11,983 కోట్లుగా ఉందని  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. కంపెనీ ఆర్థిక ఖర్చులు దాదాపు 30 శాతం పెరిగి రూ.3,722 కోట్లకు చేరుకోగా, తరుగుదల 23 శాతం పెరిగి రూ.5,877 కోట్లకు చేరుకుంది .వినియోగదారుల సంఖ్య గత క్వార్టర్‌లో 31.1  కోట్లతో పోలిస్తే క్యూ 3 లో 30.4 కోట్లకు తగ్గింది.

వొడాఫోన్ ఐడియా సీఎండీ రవీందర్ తక్కర్ మాట్లాడుతూ గత క్వార్టర్‌తో పోలిస్తే ఆదాయం 2.3 శాతం పుంజుకుందన్నారు. 14 త్రైమాసికాల  తరువాత  సగటు రోజువారీ రాబడి (ఎడిఆర్) వృద్ధి తిరిగి వచ్చిందని కంపెనీ పేర్కొంది. వేగవంతమైన నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్‌తో పాటు 4జీ కవరేజ్, కీలక మార్కెట్లలో సామర్థ్యం విస్తరణపై దృష్టి సారించినట్టు చెప్పారు. ఏజీఆర్‌ ఇతర విషయాలపై ఉపశమనం కోరుతూ  ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పారు. జనవరి 24 నాటికి కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సి సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విలువ రూ. 53,000కోట్లు.  అయితే 24 అక్టోబర్ నాటి  ఉత్తర్వులను సవరించడానికి పిటిషన్ వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన మూడు వారాల తరువాత వోడాఫోన్ ఐడియా ఫలితాలు వచ్చాయి. మరోవైపు ఏజీఆర్‌ బకాయిల  చెల్లింపులపై ఉపశమనం కల్పించకపోతే  కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన సంగతి విదితమే.  

Advertisement
Advertisement