బి.కొత్తకోట: ‘నాన్నగారి పాలనలో నా బిడ్డలు చందునాయుడు బీటెక్, గాయత్రి ఎంఎస్సీ చదివారు. ఆయన మరణానంతరం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని చంద్రగిరి నియోజకవర్గం జయరాంనగర్కు చెందిన దొరస్వామినాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. మూడేళ్ల క్రితం పక్షవాతం రావడంతో దొరస్వామినాయుడు ప్రస్తుతం నడవలేకపోతున్నాడు. ఇంటిముందు కూర్చొని ఉండగా పాదయాత్రగా వస్తున్న జననేత ఆయన వద్దకొచ్చి పలకరించారు. ఈ సందర్భంగా దొరస్వామినాయుడు తన బిడ్డల సమస్యలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
బారులు తీరిన అభిమానం
ప్రజా సంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. పాదయాత్ర జరిగే రోడ్లపై జనం బారులు తీరుతున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నేత కోసం ఎదురు చూస్తున్నారు. గొల్లపల్లె మీదుగా వస్తున్న జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున మహిళలు క్యూ కట్టారు. జననేత రాగానే వారు దిష్టితీసి, హారతులు పట్టి అనురాగాలు పంచడం అందర్నీ ఆకట్టుకుంది.