సాక్షి, రంగారెడ్డి : ఓ యువకుడి ప్రేమ వేధింపులు తాళలేక పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలంలోని వీరన్నపేట్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే బాలికను అదే గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శేగిరెడ్డి ఘనపూర్లో పదోతరగతి చదువుతున్న రాజేశ్వరిని పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో వేధించేవాడు. గతంలో బాలిక తల్లిదండ్రులు అతన్ని మందలించిన ఆ యువకుడిలో మార్పురాలేదు. ఇక మళ్లీ వేధింపులకు పాల్పడడంతో మనస్థాపం చెందిన బాలిక సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.