చిన్నారిపై అత్యాచారం.. హత్య | Sakshi
Sakshi News home page

చిన్నారిపై అత్యాచారం.. హత్య

Published Fri, Oct 13 2017 4:41 AM

6-year-old girl dead after man rapes, pushes her into well

జహీరాబాద్‌: వరుసకు చిన్నాన్నే ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి చిన్నారిపై అత్యాచారం చేసి.. బతికి ఉండగానే బావిలో పడేసి హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌కి చెందిన స్వప్న, అంజయ్య దంపతుల ఏకైక కుమార్తె గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. అంజయ్య చిన్నాన్న కుమారుడైన శివకుమార్‌.. బుధవారం మధ్యాహ్నం సాయిప్రియకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి దగ్గరకు పిలిపించుకున్నాడు.

తన వెంట గ్రామానికి అర కిలో మీటరు దూరంలోని వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో తోసేశాడు. సాయంత్రం పాఠశాల వదిలిన అనంతరం కుమార్తె ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పాప ఆచూకీ కోసం వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో చిరాగ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి.. శివకుమార్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరాన్ని అంగీకరించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు సైకోగా వ్యవహరించే వాడని గ్రామస్తులు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement