న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సిగ్నేచర్ బ్రిడ్జిపై వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 24 గంటల్లోపే రెండు ప్రమాదాలు సంభవించాయి. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. శనివారం(నేడు) జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ రోజు ఉదయం ఇద్దరు యువకులు బైక్ మీద సిగ్నేచర్ బ్రిడ్జిపై నంగ్లోయి వెళ్తున్నారు. అయితే వేగంగా వెళ్తున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి బ్రిడ్జిపై ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది.
ప్రమాదానికి గురైన వారిని ఘజియాబాద్కు చెందిన శంకర్(24), దీపక్(17)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. దీపక్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి జనాలు ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకుగాను ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి మరి స్టంట్లు చేస్తున్నారంటూ పోలీసులు వివరించారు.