భార్యకు కరోనా పాజిటివ్‌.. భర్త ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భార్యకు కరోనా పాజిటివ్‌.. భర్త బలన్మరణం

Published Thu, Apr 30 2020 6:01 PM

After Wife Tests Covid 19 Positive Man Ends His Life In Gurgaon - Sakshi

చండీగఢ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి భార్య ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుర్గావ్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. సత్బీర్‌ సింగ్‌(54) అనే వ్యక్తి కొంతకాలంగా ఉపాధి లేక ఇంట్లోనే ఉంటున్నాడు. అతడి కుమారుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సత్బీర్‌ సింగ్‌ భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. ఇటీవల ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. (భారత్‌లో పంజా విసురుతున్న కరోనా)

ఈ నేపథ్యంలో బుధవారం తన బెడ్‌రూంలో నిద్ర పోయిన సత్బీర్‌ అర్ధరాత్రి లేచి సీలింగ్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో మృతుడి కుమారుడు, కోడలు ఇంట్లోనే ఉన్నారని.. వారి ప్రవర్తన అనుమానించదగినట్లుగా లేదని పేర్కొన్నారు. వారిచ్చిన వివరాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని... సత్బీర్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు వెల్లడి కాలేదన్నారు. కాగా తల్లి ఆస్పత్రిలో ఉండగా.. తండ్రి ఇలా బలవన్మరణం చెందడంతో సత్బీర్‌ కుమారుడు విషాదంలో మునిగిపోయాడు.(శునకాలతో కరోనా నిర్ధారణ పరీక్షలు!)

Advertisement
Advertisement