ఆర్మీ అధికారి కుమార్తెల దుర్మరణం.. | Sakshi
Sakshi News home page

కంటెయినర్‌ను ఢీకొన్న కారు

Published Mon, Apr 15 2019 12:51 PM

Army Employee Daughters Died in Car Accident - Sakshi

తూర్పుగోదావరి, ప్రత్తిపాడు: గ్రామంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ అధికారి బాలికలు ఇద్దరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీకి చెందిన వినీత్‌ అగర్వాల్‌ మిలట్రీ అధికారి (కల్న ల్‌)గా పని చేస్తున్నారు. ఈయన కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌ నుంచి కారులో కోల్‌కతాకు పయనమయ్యారు. ఆదివారం ఆయన భార్య సుభాయ్, ఇద్దరు కుమార్తెలు రాధికా అగర్వాల్‌ (16), రితికా అగర్వాల్‌ (14) కారులో రాజమహేంద్రవరం స్నేహితుడి ఇంటో ఆగి తిరిగి వెళ్తుండగా వీరి కారు ధర్మవరం గ్రామ జోడుగడ్ల వాగు సమీపాన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవింగ్‌ చేస్తున్న అగర్వాల్, వెనుక సీటులో ఉన్న భార్య సుభాయ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందు, వెనుక సీట్లలో ఓ వైపు కూర్చున్న కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని జగ్గంపేట సీఐ వై.రాంబాబు, ప్రత్తిపాడు ఎస్సై ఎ.బాలాజీ పరిశీలించారు. ఆర్మీ అధికారి పదోన్నతిపై కోల్‌కతాకు కుటుంబంతో కలిసి వెళ్తున్నట్టు తెలిసింది.  

లారీ ఢీకొని ఇంటర్‌ విద్యార్థి..
రాజమహేంద్రవరం రూరల్‌: ఇంటర్‌ పరీక్షలు రాసిన అతడు ఖాళీ సమయంలో ఇంటికి చేదోడు వాదోడుగా ఉందామని తాపీపనికి వెళుతున్న ఆ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రతి రోజూ రాజమహేంద్రవరంలో తాపీపనికి వెళుతున్న గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన తమ్మనబోయిన రవి (19)ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దివాన్‌చెరువు సమీపంలోని గైట్‌ కళాశాల వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆచంట నాగవెంకటేష్, ముత్తుత్తి సూర్యనారాయణతో కలిసి రవి ఆదివారం ఉదయం మోటార్‌ బైక్‌పై రాజమహేంద్రవరం తాపీపనికి వచ్చారు. ఇంటికి తిరిగి వెళుతుండగా లారీ బైక్‌ను అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యనారాయణ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. నాగ వెంకటేష్‌ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంకటేష్‌ ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి అవుట్‌ పోస్టు పోలీసులు బొమ్మూరు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
Advertisement