మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీ మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్పై ఆదివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ భవానీప్రసాద్, సహచర కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకుడు బోయపాటి సురేష్ దాడి చేశారు. టీడీపీ పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపులు, వివాదాలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. తాను బీసీని కావడంతోనే టీడీపీలోని ఓ వర్గం నాయకులు దాడి చేశారని చైర్మన్ కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ సీనియర్ నాయకుడు గంగారపు రాందాస్చౌదరి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు జరిగిన ప రాభవంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాల ని విజ్ఞప్తి చేశారు. జరిగిన సంఘటనపై ఇరువర్గాలు పో లీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
అసలు ఏమి జరిగిందంటే..
బెంగళూరు బస్టాండులోని బడేమకాన్ భూములకు సంబంధించి చాలా రోజులుగా టీడీపీ నాయకుల మద్య అంతర్ యుద్ధం కొనసాగుతోంది. స్థలానికి సం బంధించి కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని, తమకు స్థలాన్ని స్వాధీనం చేయాలని టీడీపీలోని ఓ వర్గం నాయకులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ చాలాకాలంగా తిరుగుతున్నారు. చైర్మన్ను కలి సి తమకు సహకరించాలని కోరినట్టు తెలిసింది. అందుకు ఆయన సహకరించలేదు. పైగా వారికి స్థలం దక్కకుండా చేసేందుకు శివప్రసాద్ ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా స్థలంలో తనకు ఐదు కుం టలు ఇస్తే పని సజావుగా జరగనిస్తానని, లేకుంటే తాను పదవిలో ఉండేంత వరకు స్థలాన్ని స్వాధీనం చేసుకోలేరని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై తిరుపతి, చిత్తూరు పార్టీ కార్యాలయాలు, ఇన్చార్జ్ మంత్రుల సమక్షంలోనూ అనేకమార్లు పంచాయితీలు కూడా జరిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం ఎమ్మెల్సీ రాజసింహులు(దొరబాబు) నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా బడేమకాన్ భూముల వ్యవహారాన్ని ఎమ్మెల్సీకి చెప్పుకునేందుకు సంబంధిత వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారి గురించి దొరబాబుకు చైర్మన్ శివప్రసాద్ తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు వారిని కలవనీయకుండానే పంపేశారని ప్రత్యర్థుల ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అడిగేం దుకు మున్సిపాలిటీకి వచ్చి మాటామాటా పెరగడంతో చైర్మన్ శివప్రసాద్పై దాడికి పాల్పడినట్లు సమాచారం.
పరస్పరం సవాళ్లు
తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు చైర్మన్ శివప్రసాద్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అలాగే కమిషనర్ భవానీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కూడా వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై సీఐ నిరంజన్కుమార్కు వివరిస్తుండగానే మరో వర్గానికి చెందిన గంగారపు రాందాస్ చౌదరి, సీడ్ మల్లికార్జున నాయుడు, బోడిపాటి శ్రీనివాస్ అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. విస్తుపోయిన సీఐ బలప్రదర్శనలకు సమయం కాదని వారించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు భూఆక్రమణల విషయమై మున్సిపాలిటీ కార్యాలయంలో గొడవ పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.