డూప్లికేట్‌ కెమెరా విక్రయించాడని..     | Sakshi
Sakshi News home page

 యువకుడిపై దాడి

Published Fri, Jun 22 2018 8:54 AM

Attack On One In Chikkadapalli - Sakshi

ముషీరాబాద్‌/చిక్కడపల్లి : ఓఎల్‌ఎక్స్‌లో డూప్లికేట్‌ కెమెరా విక్రయించాడనే కోపంతో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్‌ జెమిని కాలనీకి చెందిన ఆకాష్‌సింగ్‌ నెల రోజుల క్రితం ఓఎల్‌ఎక్స్‌లో తన కెమెరాను విక్రయానికి పెట్టగా, కిషన్‌బాగ్‌కు చెందిన కరన్‌వీర్‌సింగ్‌ రూ.15వేలకు కొనుగోలు చేశాడు.

దానిని రిపేర్‌షాపులో చూపించగా డూప్లికేట్‌ అని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన కరణ్‌ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. గురువారం చిక్కడపల్లిలోని ఓ కెమెరా రిపేర్‌ దుకాణం వద్దకు రావాలని ఆకాశ్‌సింగ్‌ చెప్పడంతో కరన్‌వీర్‌సింగ్‌ అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన అక్కడే ఉన్న పేపర్లు కట్‌ చేసే బ్లేడ్‌తో ఆకాశ్‌సింగ్‌పై దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు  ముషీరాబాద్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుమలగిరిలోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేశారు. చిక్కడపల్లి ఏసిపి ప్రదీప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో చిక్కడపల్లి డిఐ రాకేష్, ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement