బంజారాహిల్స్: అర్ధరాత్రి నడిరోడ్డుపై తనను వివస్త్రను చేసిన తన మాజీ ప్రియుడు ఫిరోజ్ఖాన్, అతని తాజా ప్రియురాలు కీర్తిలను ఇంత వరకు అరెస్ట్ చేయకపోవడం పై బాధితురాలు షేక్ సమీర బంజారాహిల్స్ పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిపై క్రిమినల్ కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసింది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లాకు చెందిన షేక్ సమీర బుల్లి తెర నటిమాత్రమే కాకుండా దుబాయ్లో ఉద్యోగం చేస్తోంది. గుట్కా వ్యాపారి ఫిరోజ్ఖాన్తో కొద్ది రోజులు ప్రేమలో ఉన్న సమీర ఇటీవల మనస్పర్థలతో విడిపోయింది. అదే సమయంలో ఫిరోజ్తో మరో అమ్మాయి కీర్తి ప్రేమలో పడింది. ఈ నెల 25న రాత్రి అమెన్షియా పబ్లో సమీర మద్యం సేవిస్తుండగా ఫిరోజ్, కీర్తి అక్కడికి వచ్చారు. అంతకుముందే తాను మాదాపూర్లో ఉంటున్న హాస్టల్ నుంచి వెంబడించి కావాలనే ఈ పబ్కు వచ్చారని తెలిపింది.
తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్తో కీర్తి తన చేతులకు గాట్లు పెట్టిందని, అక్కడికి పారిపోవడానికి యత్నించగా వారు తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని కీర్తి ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించినట్లు తెలిపింది. అక్కడి నుంచి జీవీకే వన్ చౌరస్తాకు తీసుకెళ్లి వివస్త్రను చేసి గంటపాటు నడిరోడ్డుపై నిలబెట్టారని ఆరోపించింది.రూ. 1.50 లక్షల విలువ చేసే వాచ్, నగదు, రెండు సెల్ఫోన్లు లాక్కొని వెళ్లిపోయారని పేర్కొంది. అదే రోజు తాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిరోజ్, కీర్తిలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇంత వరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఇప్పటికీ తనను వెంబడిస్తున్నారని హత్య చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. పోలీసులు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.