బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Published Tue, Apr 16 2019 2:07 PM

Btech Student Suspicious Death In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బుల్లయ్య కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్న జ్యోత్స్న అనే విద్యార్థిని అక్కయ్యపాలెంలోని లెక్చరర్‌ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో అనుమానాలు తలెత్తాయి. మల్కాపురం ప్రకాశ్‌ నగర్‌కు చెందిన జోత్స్న ఏడాదిన్నర కాలంగా అంకుర్ కిష్‌లే అనే లెక్చరర్‌ వద్ద ఐఐటీ కోచింగ్‌కు సంబంధించి సలహాలు తీసుకుంటోంది. బిహార్‌లోని పట్నాకు చెందిన అంకుర్‌.. అక్కయ్యపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం అంకుర్‌ ఇంటికి వెళ్లిన జ్యోత్స్న అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి అంకుర్‌ చెప్పడంతో ఈ ఉదంతం​ వెలుగు చూసింది. ఆమె దేహంపై ఎటువంటి గాయాలు లేవు. గతంలో లాంగ్‌ టర్మ్‌ తీసుకునే సమయంలో అంకుర్‌తో జోత్స్నకు పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది.

అంకురే చంపి ఉంటాడు
తన కుమార్తె ఎంతో తెలివైనదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని జ్యోత్స్న తల్లి మారుతి అన్నారు. తన కూతురిని అంకురే చంపివుంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కాగా, నిందితుడు అంకుర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జ్యోత్స్న మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement
Advertisement