ద్విచక్ర వాహనం ఢీ దంపతులు మృతి | Sakshi
Sakshi News home page

కారు, ద్విచక్ర వాహనం ఢీ

Published Thu, Apr 5 2018 8:28 AM

Car Two-Wheeler Accident in Janagan - Sakshi

వర్ధన్నపేట : వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న క్రమంలో కారు ఎదురుగా అతివేగంగా వచ్చి ఢీ కొనడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని కట్య్రాల శివారులో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్‌ కథనం ప్రకారం...వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ తాళ్ల మహేందర్‌రెడ్డి(50) ఆయన భార్య ప్రభావతి(45) కలిసి వివాహ వేడుకకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో తొర్రూరు నుంచి వరంగల్‌కు వెళ్తున్న కారు అతి వేగంతో వచ్చి అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభావతి  స్థానిక మహిళా సంఘంలో సీఏగా పని చేస్తుంది. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉండగా కూతురుకు వివాహం చేశారు. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
కొత్తూరులో విషాదఛాయలు..
రాయపర్తి: మహేందర్‌రెడ్డి, ప్రభావతి మృతితో రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో అందరితో కలిసిమెలసి ఉంటూ ప్రజలతో మమేకమై తిరిగే దంపతులు ఇక లేరనే విషయం తెలుసుకుని భోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు చివరి చూపుకోసం పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement