వటోలి నిందితులపై కేసు కొట్టివేత | Sakshi
Sakshi News home page

వటోలి నిందితులపై కేసు కొట్టివేత

Published Tue, Apr 17 2018 3:09 AM

Case dismissal on Watoli accused

సాక్షి, ఆదిలాబాద్‌: వటోలి కేసులో ఆదిలాబాద్‌ కోర్టు నిందితులపై కేసును కొట్టివేసింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడానికి సీబీసీఐడీ తగిన సాక్ష్యాలు చూపించడంలో విఫలమైందని సోమవారం ఆదిలాబాద్‌ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు ఇన్‌చార్జి జడ్జి అరుణసారిక కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. 2008లో భైంసా మండలం వటోలిలో ఒకే వర్గానికి చెందిన ఆరుగురు నిద్రిస్తున్న గుడి సెకు  రాత్రి నిప్పుపెట్టి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.  

కేసు పుర్వాపరాలు..  
2008 అక్టోబర్‌ 11, 12 మధ్యరాత్రి వటోలి లోని ఓ గుడిసెలో మహబూబ్‌ఖాన్‌(55), ఫసియా ఖానమ్‌(50), రిజ్వాన బేగం(22), మీనమ్‌ఖాన్‌(3), అస్లమ్‌ఖాన్‌ (6), శబామాహిన్‌ (2) గుడిసెలో నిద్రిస్తున్న సమయం లో గ్రామానికి చెందిన కొంతమంది సజీవ దహనం చేశారని భైంసా పోలీసులు కేసు నమోదు చేశారు.

అదే గ్రామానికి చెందిన హిందూవాహిని కార్యకర్తలుగా భావిస్తున్న కుంచల్‌వార్‌ చంద్రభాన్, జాదవ్‌ వినోద్, అడబాగి చంద్రకాంత్, జాదవ్‌ అవధూత్, జాదవ్‌ భగవంత్‌రావు, సూర్యవంశి రామానంద్, జాదవ్‌ వినాయక్, కుంచల్‌వార్‌ నాగనాథ్, భైంసాకు చెందిన శిండే డిగంబర్‌లపై హత్యారోపణల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ కేసును హైదరాబాద్‌ సీబీసీఐడీకి అప్పగించింది. 2009లో సీబీసీఐడీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. 60 మంది సాక్షులను విచారించింది. నిందితులపై సాంకే తికంగా నేర నిరూపణకు సీబీసీఐడీ సాక్ష్యాలను చూపలేకపోయింది.   

Advertisement
Advertisement