కొడుకుపై తల్లిదండ్రుల పైశాచికత్వం | Sakshi
Sakshi News home page

మూడేళ్ల కొడుకుపై తల్లిదండ్రుల అమానుషం

Published Thu, Apr 18 2019 4:31 PM

Child Suffers Brain Haemorrhage After Parents Thrash Him In Kerala - Sakshi

తిరువనంతపురం : కేరళలోని ఈలూరులో దారుణం చోటుచేసుకుంది. చెప్పినట్టు వినలేదన్న కారణంగా మూడేళ్ల బాలుడిని చితకబాదారు అతడి తల్లిదండ్రులు. దీంతో బ్రెయిన్‌ హ్యామరైజ్‌కు గురైన సదరు బాలుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులపై హత్యాయత్నంతో పాటు జువైనల్‌ చట్టంలోని సెక్షన్‌ 75(చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలు... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం కేరళకు వచ్చాడు. జార్ఖండ్‌కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్న అతడికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో అల్లరి చేస్తున్నాడనే కారణంగా బుధవారం దంపతులిద్దరు కొడుకును తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోగా సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే రక్తం అధికంగా పోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పై అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... బాలుడి తల్లిదండ్రులను కేరళకు తీసుకువచ్చిన ఏజెంట్ల గురించి కూడా విచారణ జరుపుతున్నారు. కాగా వారం రోజుల క్రితం కూడా కేరళలో ఇలాంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా ఏడేళ్ల పిల్లాడిని తల్లి ప్రియుడు దారుణంగా హతమార్చాడు.

Advertisement
Advertisement