లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కీచకపర్వం చోటుచేసుకొంది. పోలీసు కానిస్టేబుల్ కూతురిని అపహరించి.. నడుస్తున్న కారులో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు. లక్నోలోని షహీద్ పాత్లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాలు ప్రకారం.. బాధిత అమ్మాయికి తనపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు దుండగులు తెలుసు. బబ్లూ, కాశీరాం జేపీ గుప్తా, హరీశ్ అనే ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో బాధితురాలు గతంలో వారికి రూ. 50వేలు ఇచ్చింది. డబ్బులు తీసుకొని చాలాకాలమైనా.. ఆ ముగ్గురు ఉద్యోగం ఇప్పించకపోవడంతో.. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో ఇప్పుడు-అప్పుడు అంటూ తాత్సారం చేసిన నిందితులు... గురువారం సాయంత్రం విభూతిఖండ్ వద్దకు రావాలని, డబ్బులు తిరిగి ఇస్తామని బాధితురాలికి చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని.. నడుస్తున్న కారులో ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం జరిపారని, అనంతరం తాలిబగ్ ప్రాంతంలో కారు నుంచి తనను విసిరేసి వెళ్లిపోయారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. దీంతో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.