సుజనా చౌదరికి భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరికి భారీ షాక్‌

Published Tue, Apr 2 2019 8:57 PM

Enforcement Directorate Attaches Properties Of Viceroy Hotels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారీ షాక్‌ ఇచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను జప్తు చేసింది. షెల్‌ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లకు కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈమేరకు చర్య తీసుకుంది. మనీ ల్యాండరింగ్‌ 2002 చట్టప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది.


 
పెద్ద డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్‌ ఇన్వాయిస్‌లతో బ్యాంకులను సుజనా గ్రూప్‌ బురిడీ కొట్టించినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. చైన్నలోని ఆంధ్రా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును షెల్‌ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. మహల్‌ హోటల్‌ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి డబ్బును వైస్రాయ్‌ హోటల్‌ లిమిటెడ్‌కు తరలించినట్టు దర్యాప్తులో తెలిసింది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌లోని సుజనా గ్రూప్‌ కార్యాలయం నుంచి కీలక పత్రాలను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బరు స్టాంపులను కూడా గుర్తించారు. (చదవండి: ‘సుజనా’ క్రియేటివ్స్‌.. మాయారాజ్యం)

Advertisement
Advertisement