అత్తా కోడళ్ల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అత్తా కోడళ్ల ఆత్మహత్య

Published Mon, Dec 3 2018 7:18 AM

Family Members Commits Suicide With Conflicts in Kurnool - Sakshi

కర్నూలు, బండిఆత్మకూరు: పొలం పనులు చేసే విషయంలో అత్తా, కోడళ్ల మధ్య నెలకొన్న బేదాభిప్రాయాలు చివరకు ఆత్మహత్యలకు దారితీశాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో సోమయాజులపల్లె గ్రామంలో ఆదివారం విషాదఛాయలు నెలకొన్నాయి. ఎస్‌ఐ విష్ణునారాయణ వివరాల మేరకు గ్రామానికి చెందిన పట్నం చిన్న జమాల్, కళావతి దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన బాల వుశేనికి గడివేముల మండలం చిందుకూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబంలో ఇద్దరు కుమారులకు వివాహం కాగా మరో కుమారునికి వివాహం కాలేదు. వీరందరూ కలిసి మెలసి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా పొలం పనులు చేసే విషయంలో అత్తా, కోడళ్ల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు లోనైన అత్త కళావతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కోడలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే కళావతి కోలుకోలేక మృతి చెందింది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో కోడలు వెంకటలక్ష్మి కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోవడంతో ఏమి జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆమె కూడా పురుగులమందు తాగిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు  నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తరలిస్తుండగా  మార్గమధ్యలో మృతిచెందింది. అత్త పురుగుల మందు తాగే సమయంలో అక్కడికి వచ్చిన కోడలు డబ్బాలో మిగిలిన మందు తాగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వెంకటలక్ష్మి తల్లి శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. 

Advertisement
Advertisement