పార్కులో యువకుడి దారుణహత్య..! | Sakshi
Sakshi News home page

పార్కులో యువకుడి దారుణహత్య..!

Published Sat, Mar 16 2019 2:06 PM

In Forest Park Of Khammam Worker Killed - Sakshi

సాక్షి,ఖమ్మంఅర్బన్‌: నగరంలోని వెలుగుమట్ల పట్టణ అటవీ పార్కులో పని కోసం వచ్చిన యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు...పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన అబ్దుల్‌(32), వెలుగుమట్ల పార్కులో పనులకు వచ్చాడు. అక్కడే నివాసముంటున్నాడు. కోల్‌కత్తాకు చెందిన వహిదుల్‌ ఇస్లాం అనే వ్యక్తి, వెలుగుమట్ల అటవీ పార్కులో డిజైనింగ్‌ పనుల కాంట్రాక్ట్‌ తీసుకున్నాడు. ఆరు నెలల నుంచి పనులు చేయిస్తున్నాడు. పార్కులోనే చిన్న గదిలో వర్కర్లు అబ్దుల్, జాకీర్‌ ఆలీ ఉంటున్నారు. పనులను పర్యవేక్షించేందుకు వాచర్లు వెంకటేశ్వర్లు, దస్తు, ఫారెస్ట్‌ పార్క్‌ అభివృద్ధి అధికారి వేణుమాధవ్‌ శుక్రవారం ఉదయం వచ్చారు. పొద్దుపోయినప్పటికీ పనులకు అబ్దుల్, జాకీర్‌ ఆలీ రాలేదు. వాచర్‌ వెంకటేశ్వర్లును ఆ వర్కర్ల గది వద్దకు అధికారి వేణుమాధవ్‌ పంపించారు.

 ఆ గదిలో, విగతుడిగా అబ్దుల్‌ కనిపించాడు. అటవీ అధికారి ఇచ్చిన సమాచారంతో సీఐ సాయిరమణ, ఎస్‌ఐ మొగిలి వచ్చారు. మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. అక్కడ, అబ్దుల్‌తోపాటు ఉంటున్న జాకీర్‌ ఆలీ కనిపించలేదు. అతడి సెల్‌ ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ ఉంది. రాత్రి వేళ వారిద్దరూ గొడవపడి ఉంటారని, అబ్దుల్‌ను రాయితో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. హత్య ప్రదేశాన్ని నగర ఏసీపీ జి.వెంకట్రావు, ఎఫ్‌ఆర్‌ఓ రాధిక పరిశీలించారు. ఆధారాలను క్లూస్‌ టీం సేకరించింది. అటవీ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతోంది. అబ్దుల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Advertisement
Advertisement