Sakshi News home page

నాలుగు రోజుల అనంతరం...

Published Thu, Apr 26 2018 12:47 PM

Four days later ... - Sakshi

నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి చివరకు మృతదేహమై కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ వ్యక్తి మద్యం అతిగా సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తుండగా...మృతదేహంపై గాయాలున్నాయని తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...

డెంకాడ : మండలంలోని విజయనగరం–నాతవలస ఆర్‌అండ్‌బీ రహదారికి ఆనుకుని పోలీస్టేషన్‌ సమీపంలో ఉన్న సెల్‌ టవర్‌ వద్ద సింగవరం గ్రామానికి చెందిన కొప్పుశెట్టి సతీష్‌(48) బుధవారం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. బుధవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి సతీష్‌ బంధువులకు  పోలీసులు సమాచారం అందించారు. మద్యం వ్యసనానికి బానిసైన సతీష్‌ ఎక్కువ మద్యం సేవించి, నీరు అందకపోవడం వల్ల మరణించి ఉంటాడని హెచ్‌సీ అప్పారావు తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్‌గా సతీష్‌ పని చేసే వాడని విధులకు సక్రమంగా వెళ్లకపోవడంతో ఉద్యోగం నుంచి నిలుపుదల చేశారన్నారు. ఈ నెల 22న ఇంటి నుంచి వెళ్లిన సతీష్‌ బుధవారం శవమై కనిపించాడు. మరణించిన సతీష్‌ది గుర్ల మండలంలోని గుజ్జివలన గ్రామానికి చెందిన వాడు. చాలా కాలం కిందట సింగవరం వచ్చేశారు. భార్య అనురాధ ఫిర్యాదు మేరకు డెంకాడ ఎస్‌ఐ కృష్ణవర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బంధువుల అనుమానాలు...

సతీష్‌ శరీరంపై గాయాలు ఉన్నాయని...ఆయనను ఎవరో కొట్టడం వల్ల మరణించి ఉంటాడని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. సతీష్‌ మరణం విషయంలో తమకు పలు అనుమానాలు ఉన్నాయని, పోలీస్‌ అధికారులు పూర్తి విచారణ చేసి  వాస్తవాలు తెలియజేయాలని కోరారు.

Advertisement
Advertisement