వధువు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి | Sakshi
Sakshi News home page

వధువు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి

Published Thu, Apr 19 2018 6:55 PM

Groom Parents Complaint On Bride Parents - Sakshi

మంగళగిరిటౌన్‌: ప్రేమించి పెళ్లిచేసుకున్న తమ కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ ఇంటిపైన సమూహంతో దౌర్జన్యంగా దాడిచేసి, విచక్షణా రహితంగా ప్రవర్తించారని, వారి నుంచి రక్షణ కల్పించాలని యువకుడి తండ్రి మోపర్తి శోభన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... మోపర్తి శోభన్‌బాబు కుమారుడు మోపర్తి అశోక్‌ చక్రవర్తి గ్రామంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏప్రిల్‌13వ తేదీ కాకుమాను మండలం లింగంగుంట్లకు చెందిన సౌభాగ్యశ్రీతో మంగళగిరి మండలంలోని ఈసీఏ చర్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

అనంతరం సౌభాగ్యశ్రీ పెద్దల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అప్పటినుంచి ఆ జంట అశోక్‌ చక్రవర్తి తల్లిదండ్రుల వద్ద కాకుండా వేరేచోట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం రాజకీయ ప్రాబల్యంతో 50 మంది సమూహం తమ ఇంటిపైకి వచ్చి నీ కుమారుడు ఎక్కడున్నాడో చెప్పండని దాడి చేయడానికి ప్రయత్నించారని అశోక్‌చక్రవర్తి తండ్రి శోభన్‌బాబు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అమ్మాయి బంధువుల నుంచి తమ కుమారుడు, కోడలితో పాటు తమకు రక్షణ కల్పించాలని శోభన్‌బాబు విజ్ఞప్తిచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement